పుట్టపర్తి అర్బన్: కారు బోల్తా పడిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన మేరకు... ప్రశాంతి నిలయంలో శుక్రవారం జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు బెంగళూరులోని యలహంకలో నివాసముంటున్న మంజునాథ్ కుటుంబం అదే రోజు ఉదయం కారులో బయలుదేరారు. పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద 432వ జాతీయ రహదారిపై కారు ముందరి టైర్ పేలింది. ఆ సమయంలో వాహనం అదుపు తప్పి కల్వర్టుకు కట్టిన రక్షణ గోడను బలంగా ఢీకొని రోడ్డు పై బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న మంజునాథ్, ఆయన భార్య అనిత, కుమారులు దర్శన్, కౌశిక్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఏడాది వయసున్న కౌశిక్ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ క్రాంతి తెలిపారు.


