తనకల్లు: శ్రీరామనవమిని పురస్కరించుకుని తనకల్లు మండలం పెద్దపల్లి వద్ద 89 అడుగుల ఎత్తుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అయోధ్య శ్రీరామమందిరం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామానికి చెందిన డాక్టర్ ముక్తియార్బాషా ఆధ్వర్యంలో ఐదు రోజులుగా ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన కళాకారులు ఈ ఆలయ నమూనాను తీర్చిదిద్దారు. మందిరం అంతర్భాంగా సీతారామ, లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయం ఎదుట ఉన్న శ్రీరాముడి భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శుక్రవారం నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించనున్నట్లు డాక్టర్ ముక్తియార్బాషా తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తుల కోసం తనకల్లు మండలం కొక్కంటి క్రాస్, అనమయ్య జిల్లా మొలకలచెరువు, కర్ణాటకలోని చాకివేలు నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.


