అమరాపురం: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆదేశించారు. డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్యతో కలిసి గురువారం అమరాపురం మండలంలో ఆయన పర్యటించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడారు. తాగునీటి సమస్యపై ఆరా తీశారు. మండలంలోని 32 గ్రామాల్లో శ్రీరామరెడ్డి పథకం కింద తాగునీరు సక్రమంగా అందడం లేదని అధికారులు వివరించారు. దీంతో వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూసే బాధ్యత అధికారులదేనన్నారు. లోపాలను వెంటనే సరిచేసుకోవాలన్నారు. ఆస్తి పన్ను వసూళ్లు వందశాతం పూర్తి చేయాలన్నారు. చెత్తతో సంపద తయారీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామారావు, ఈఓఆర్డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హేమావతి గ్రామంలో వెలసిన సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఈ సందర్భంగా వారి వెంట కార్యదర్శి ఈరన్న ఉన్నారు.


