ప్రతి ఇంటా ‘సిరుల’ పంట
రొద్దం: మండలంలోని మారుమూల గ్రామమైన బీదానిపల్లిలో ప్రతి ఇంటా రైతులు సిరుల పంటను పండిస్తున్నారు. తమకున్న పొలాల్లో బోరు బావుల ఏర్పాటు చేసుకుని ప్రతి రైతూ మల్బరీ సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు బీదవానిపల్లిగా పేరున్న గ్రామం కాస్త ధనికులపల్లిగా మారుతోందని స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఉన్న కొద్దిపాటి నీటితోనే..
దశాబ్దాల క్రితం బీదానిపల్లిలోనూ రైతులు సంప్రదాయ పంటల సాగుతోనే జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో సాగు చేసిన పంటలు కాస్త ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతింటూ వచ్చాయి. దిగుబడులు తగ్గి రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకునేవారు. ఇలాంటి తరుణంలో పంటల సాగులో రైతల ఆలోచన విధానం మారింది. ఒకరి తర్వాత ఒకరుగా తమకున్న పొలాల్లో బోరు బావులు తవ్వించారు. లభ్యమైన తక్కువ నీటి వనరుతోనే మల్బరీ సాగు చేపట్టారు.
అత్యధికంగా మల్బరీ సాగు..
పట్టు పరిశ్రమ శాఖ ద్వారా అందుతున్న ప్రోత్సాహాకాలను రైతులు సద్వినియోగం చేసుకున్నారు. రేరింగ్ షెడ్లు, రేషం మేపునకు ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో 120 కుటుంబాలు ఉండగా... ఇందులో 110 కుటుంబాలు మల్బరీ సాగుతోనే జీవనం సాగిస్తున్నాయి. బోరు బావుల్లో సమృద్ధిగా నీరు రాకపోయినా.. ఉన్న కొద్దిపాటి నీటితోనే మల్బరీ సాగు చేస్తున్నట్లు రైతులు గోపాలరెడ్డి, రామాంజనేయులు, నాగభూషణప్ప, గంగాధర్, కృష్ణప్ప, అశ్వత్థప్ప తెలిపారు. గ్రామంలోని ప్రతి రైతూ మల్బరీ పంట పెట్టినట్లు వివరించారు. మార్కెట్లో ప్రస్తుతం బైవోల్టిన్ పట్టు గూళ్లు కిలో దాదాపు రూ 850 నుంచి రూ.860, సీబీ రకం పట్టు గూళ్లు రూ.810 ఉన్నాయని, ధరలు నిలకడగా కొనసాగితే తమ కష్టాలు తీరిపోతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆదర్శంగా నిలుస్తున్న
బీదానిపల్లి రైతులు
గ్రామంలో 110 కుటుంబాలు
మల్బరీ సాగు
ప్రతి ఇంటా ‘సిరుల’ పంట


