‘ఉపాధి’కి మంగళం!
పుట్టపర్తి అర్బన్: సర్కార్ చర్యలతో ఉపాధి హామీ పథకం లక్ష్యానికి దూరంగా నిలిచింది. ఇప్పటికే కూలీలకు రూ.కోట్లలో బిల్లులు బకాయిగా ఉన్న ప్రభుత్వం... ఈ ఏడాది కేవలం రెండు నెలలు పనులు మాత్రమే చూపి చేతులెత్తేసింది. దీంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉద్యాన రైతులకూ సర్కార్ మొండి చేయి చూపుతోంది. 10 నెలల నుంచి తోటల పెంపకానికి ఇచ్చే బిల్లులు మంజూరు చేయకుండా వేధిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లులు సకాలంలో మంజూరు చేయించాల్సిన ప్రజాప్రతినిధులు కూడా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
రూ.కోట్ల బిల్లులు పెండింగ్..
ఉపాధి హామీలో భాగంగా డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులకు మార్చి నుంచి ఇప్పటి వరకూ సుమారు రూ.4.8 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా మొక్కలు నాటుకున్న రైతులకూ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో రైతులు అప్పులు చేసి మరీ మొక్కలు కాపాడుకుంటున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేక భూగర్భ జలమట్టం కూడా తగ్గింది. ఫలితంగా మొక్కలన్నీ వాడుముఖం పట్టాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉపాధి హామీ నిధులైనా మంజూరైతే ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు అందించవచ్చని బిల్లుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
రూ.2 లక్షలకే పరిమితం..
గత మూడేళ్లలో జిల్లా రైతులు 15,951 ఎకరాల్లో ఉద్యాన తోటలు సాగు చేశారు. గతంలో డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద 5 ఎకరాల్లోపు మొక్కలు నాటి మూడేళ్ల పాటు వాటిని సంరక్షించుకునే రైతులకు రూ. 5 లక్షల వరకూ బిల్లు చెల్లించేవారు. అయితే ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.2 లక్షలకు పరిమితం చేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కల ధరలు, నీటి సరఫరా ఖర్చు, ట్రాక్టర్ బాడుగలు, కంచె, కూలీల ఖర్చు పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే బిల్లులు చాలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిమితి రూ. 2 లక్షలకే కుదిస్తే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మరోవైపు ఇప్పటికే తోటలు సాగు చేసిన రైతులకు మొదట్లో అరకొరగా వచ్చిన బిల్లులు... ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి. 10 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఒక నీళ్ల ట్యాంకర్ నీళ్లకు రూ. 1,000 వరకూ ఖర్చు వస్తోందని, పొలం దున్నడానికి ట్రాక్టర్కు గంటకు రూ. 1000 బాడుగ ఇవ్వాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇలా ఖర్చులు పెరుగుతుండగా...ప్రభుత్వం మాత్రం పరిమితులు విధిస్తూ బిల్లులు బకాయి పెట్టడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు చెబుతున్నారు.
ఒక్కో మొక్క సంరక్షణకు రూ.5.45..
ఉపాధి హామీ పథకానికి మంగళం
పాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
కూలీలకు పనులు కల్పించి వలసలు
నివారించడం.. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండి ఉద్యాన తోటలు సాగుచేసే చిన్న, సన్నకారు రైతులకు ఊతంగా నిలిచిన
పథకాన్ని చంద్రబాబు సర్కార్
నీరు గారుస్తోంది. బిల్లులు మంజూరు చేయకుండా కూలీలను అష్టకష్టాలు
పెడుతోంది. అలాగే డ్రైల్యాండ్
హార్టికల్చర్ కింద ఉద్యాన తోటలు
సాగుచేసిన రైతుకు బిల్లులు
ఇవ్వకుండా అప్పుల పాలు చేసింది.
డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద ఉద్యాన తోటలు సాగు చేసే రైతులకు మొదటి ఏడాది మొక్కలకు గుంతలు తీయడం, మొక్కల రవాణా, నాటడం, నీళ్లు పెట్టడం, కంచె, పొలం దున్నడం తదితర పనులకు ఉపాధి హామీ పథకం కింద బిల్లులు చెల్లిస్తారు. ఒక్కో మొక్కకు ఒక్కసారి వాటరింగ్కు రూ.5.45 మేర చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా మూడు నెలల పాటు ఉండే వేసవిలో ఒక్కో మొక్కకు నీరు అందించేందుకు సుమారు రూ.1,000 వరకూ బిల్లు ఇస్తారు. ఎరువులు, పొలం దున్నడం, కంచె ఏర్పాటు తదితర వాటికి రెండు, మూడో సంవత్సరాల్లో బిల్లులు ఇస్తారు. ఈ బిల్లులు ప్రస్తుతం రూ.4.8 కోట్ల మేర పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు.
‘ఉపాధి’కి మంగళం!


