స్క్రబ్ టైఫస్పై అలర్ట్
అనంతపురం మెడికల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. ఇందులో మంగళవారం ముదిగుబ్బ, గుమ్మఘట్ట మండలం తాళ్లకెర ప్రాంతానికి చెందిన ఇద్దరికి పాజిటివ్ ఉన్న విషయం వెలుగులోకి రాగా.. బుధవారం కిరికెర గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ పాజిటివ్ కేసుల్లో ఐదు నెలల గర్భిణి ఉండటం గమనార్హం. కేసులు కలకలం రేపుతుండటంతో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సూపరింటెండెంట్ కేఎల్ సుబ్రహ్మణ్యం, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. ఈఎన్టీ వార్డులోని రోగులను మరో వార్డుకు తరలించి.. అక్కడ 20 పడకలతో స్క్రబ్ టైఫస్ వార్డు ఏర్పాటు చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి ర్యాపిడ్ యాక్షన్ టీంను అందుబాటులో ఉంచారు. మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ భీమసేనాచార్, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, వైద్య కళాశాల నుంచి డాక్టర్ ఆది నటేష్, డాక్టర్ సరోజమ్మ, డాక్టర్ కృష్ణవేణిలను నియమించారు. మరోవైపు తాళ్లకెరకు చెందిన ఓ విద్యార్థిని స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడినట్లు తెలియడంతో మలేరియా సబ్యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్, వైద్యులు సందేశ్, తహసీల్దార్ రజాక్వలి, ఎంపీడీఓ జయరాములు గ్రామంలో పర్యటించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కీటకనాశిని మందుతో గ్రామంలో పిచికారీ చేయించారు.
సర్వజనాస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డు
మూడుకు చేరిన పాజిటివ్ కేసులు
స్క్రబ్ టైఫస్పై అలర్ట్


