సైనిక కుటుంబాలకు అండగా నిలుద్దాం
● కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పిలుపు
ప్రశాంతి నిలయం: దేశ రక్షణ కోసం ప్రాణం పెట్టే సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప ఆధ్వర్యంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ సాయుధ దళాల పతాక నిధికి తమ వంతు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సైనికులు త్యాగాలకు దేశ ప్రజలందరూ రుణపడి ఉండాలన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విరివిగా సైనికులు కుటుంబాల సంక్షేమం కోసం విరాళాలు ఇవ్వాలన్నారు. అంతకుముందు సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జగరాజుపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో పలువురు ఉద్యోగులతో పాటు మాజీ సైనికులు పాల్గొన్నారు.
పల్స్ పోలియోను విజయవంతం చేయండి
జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 21న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ‘పల్స్ పోలియో’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 0 నుంచి ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. 21వ తేదీని బూత్లలో పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు 22, 23 తేదీల్లో ఇంటింటికీ తిరిగి వేయాలన్నారు.
బాల్య వివాహాలను అరికట్టాలి
బాల్యవివాహాలను అరికట్టి బాలికలకు బంగారు భవిష్యత్ ఇచ్చేందుకు అందరూ పాటుపడాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ‘బాల్య వివాహ ముక్తు భారత్’ 100 రోజుల కార్యక్రమానికి సంబంధించి ‘బాల్య వివాహం అపుదాం–దేవుని కృపను పొందుదాం’ అనే నినాదంతో తయారు చేసిన బాల్య వివాహాల వ్యతిరేక వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి అధికారి, క్షేత్రస్థాయి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఎవరైనా బాల్య వివాహానికి పూనుకుంటే వెంటనే 1098 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


