ఫ్లెక్సీ మీద పడి ఇద్దరికి తీవ్రగాయాలు
అనంతపురం క్రైం: నగర పాలక సంస్థ పరిధిలో టీడీపీ నేతలు అనధికారికంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ మీదపడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని బళ్లారి బైపాస్ చౌరస్తా.. 44వ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ప్రధాన అనుచరులు రమేష్, నలుబోలు మధుతో పాటు పలువురు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ఒకటి గాలికి ఎగిరి అటుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లికి చెందిన సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డిపై కుప్పకూలింది. ఐరన్ ఫ్రేమ్ నుదిట్లోకి దూసుకెళ్లడంతో సంజీవరెడ్డి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడు. శ్రీనివాసరెడ్డి తలకు బలమైన గాయమై అరగంటకు పైగా అపస్మారకంగా రోడ్డుపై పడిపోయాడు. అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సర్వజనాస్పత్రికి తరలించింది. పరిశీలించిన వైద్యులు సంజీవరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, గాలికి ఊగుతున్న భారీ ఫ్లెక్సీని తొలగించాలని పలుమార్లు టీడీపీ నేతలకు తెలిపినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్థానికులు తెలిపారు. చివరకు నగర పాలక సంస్థ అధికారులకు తెలిపినా వారు కూడా పట్టించుకోలేదన్నారు. చివరకు పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు ప్రాణాలు బలయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
రూ.2.5 కోట్ల విలువైన సామగ్రి దగ్ధం
తాడిపత్రి రూరల్: స్థానిక కడప రోడ్డులోని మల్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న లిక్కీ ఇంటీరియర్ దుకాణంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుని రూ.2.5 కోట్ల విలువైన ప్లైవుడ్ కాలి బూడిదైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. యజమాని మోహన్ నుంచి సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


