విభిన్న ప్రతిభావంతులకు రేపు క్రీడా పోటీలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల (అంధులు, మూగ, శారీరక, మానసిక)కు అనంతపురంలోని పీటీసీ మైదానంలో శనివారం క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల, హిజ్ర, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు జి.అర్చన గురువారం వెల్లడించారు. శనివారం ఉదయం 10 నుంచి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయి. ఆసక్తి ఉన్న ప్రతిభావంతులు అదే రోజు నేరుగా పీటీసీ మైదానానికి చేరుకుని పేర్లు నమోదు చేసుకోవచ్చు.
ఇంటింటా సర్వే పూర్తి చేయండి : జేడీఏ
పెనుకొండ రూరల్: ‘రైతన్న మీకోసం’ సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్ ఆదేశించారు. పెనుకొండ మండలం శెట్టిపల్లి పంచాయతీ బొజ్జారెడ్డి పల్లిలో చేపట్టిన సర్వే ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ కృష్ణమీనన్, ఏఓ చందన, సిబ్బంది పాల్గొన్నారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
కళ్యాణదుర్గం రూరల్: తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వలేదంటూ ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాలు.. కళ్యాణదుర్గంలోని కమ్మరచెట్ల వీధికి చెందిన వివాహిత శైలు.. స్థానిక వాల్మీకి సర్కిల్లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుంది. బంగారాన్ని విడిపించుకునేందుకు గురువారం ఫైనాన్స్ కంపెనీకి వెళ్లిన సమయంలో ఖాతా హోల్డ్లో ఉండడంతో సొత్తు ఇవ్వడం కుదరదని సిబ్బంది తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి చేరుకుని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
పామిడి ఏపీఎంఎస్ విద్యార్థుల మధ్య గొడవ
పామిడి: స్థానిక ఏపీ మోడల్స్కూల్లో చదువుకుంటున్న కత్రిమల గ్రామ విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి బస్సులో గ్రామానికి వెళుతున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. ఓ విద్యార్థి తన చేతిలోని వాటర్ బాటిల్తో దాడి చేయబోతుండగా అది వెళ్లి పక్కనే ఉన్న 7వ తరగతి విద్యార్థి తలకు తగిలి రక్తగాయమైంది. క్షతగాత్రుడికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పామిడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జేబు దొంగల అరెస్ట్
రాప్తాడు: నలుగురు జేబు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. ఈ నెల 23న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి కుమార్తె వివాహ వేడుకలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాజరైన గొల్లపల్లికి చెందిన పద్మావతి మెడలోని 3 తులాల బంగారు చైన్ను దుండగులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో నెల్లూరు జిల్లాకు చెందిన బోచు రాము, హైదరాబాద్కు చెందిన సాకే శీను, రవి, అనంతపురం నివాసి సాకే పుల్లయ్యను గురువారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం సిటీ: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షకు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ దరఖాసుకు గడువును డిసెంబర్ 3వ తేదీ వరకు పొగించారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూ కొఠారి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలకు 95502 50770, 97042 04905 నంబర్లలో సంప్రదించవచ్చు.
సెల్ఫోన్ చోరీ... ఫోన్ పే నుంచి నగదు బదిలీ
కళ్యాణదుర్గం: పట్టణానికి చెందిన హెల్త్ అసిస్టెంట్ వీరశేఖర్ ఫోన్ను చోరీ చేసిన దుండగుడు.. ఆ తర్వాత అందులోని ఫోన్ పే ద్వారా రూ.10 వేల నగదు బదిలీ చేసుకున్నాడు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్యాణదుర్గంలో బుధవారం సాయంత్రం జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొన్న వీరశేఖర్ వద్ద నుంచి ఫోన్ను చోరీ చేసినట్లుగా తెలిసింది. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం పట్టణ సీఐ హరినాథ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


