
జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అతి తెలివిని
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో చోటు చేసుకుంటున్న వరుస దొంగతనాలు పోలీసుల పనితీరును సవాల్ చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కలెక్టర్ బంగ్లా పక్కనే.. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని రాత్రి, పగలు తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంటి బయట రాత్రి ఉంచిన బైకులు తెల్లవారేసరికి మాయం అవుతున్నాయి. ఏడాది క్రితం ఎన్నికలకు ముందు సాక్షాత్తూ కలెక్టర్ బంగ్లాలోనే బంగారం అపహరించిన ఘటన జిల్లాను కుదిపేసింది. అయితే ఇప్పటి వరకూ ఏఒక్క కేసు దర్యాప్తులోనూ పోలీసులు పురోగతి సాధించలేకపోయారు. బాధితులకు న్యాయం జరిగిన దాఖలాలూ లేవు.
ఏడాది వ్యవధిలోనే..
● పుట్టపర్తిలోని జానకీరామయ్య కాలనీలో నివాసముంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉదయం 9 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి మెయిన్ రోడ్డుపైకి చేరుకుని టిఫిన్ తిని ఇంటికెళ్లాడు. అప్పటికే తాళం బద్ధలుగొట్టి ఉంది. లోపలకెళ్లి చూస్తే చార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ కనిపించలేదు. ఘటనపై పోలీసులు కేసు సైతం నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ రికవరీ చేయలేకపోయారు.
● సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి క్వార్టర్స్ గేటు ఎదురుగా చిల్లర దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తి రోజూ ఉదయాన్నే తన బైకును పగటి పూట చెట్టు కింద పార్క్ చేసి వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఉదయం పార్క్ చేసిన బైక్.. చీకటి పడే లోపు మాయమైంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని బాధితుడు వాపోతున్నాడు.
● చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన ఓ వ్యక్తి ఉదయం 7 గంటలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చాడు. టోకెన్ తీసుకుని.. వైద్యం పొందిన తర్వాత 11.30 గంటలకు బయలకు వచ్చి చూడగా.. బైక్ కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాాడు. ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు.
● ఎన్నికలకు ముందు కలెక్టర్ నివాసముంటున్న బంగ్లాలోనే బంగారం ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు ఏమైందో? దొంగ ఎవరో? ఇప్పటికీ వెల్లడించలేదు. కొన్ని రోజుల పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయినా ఇప్పటికీ అరెస్ట్ చూపలేదు.
● మూడు నెలల క్రితం పుట్టపర్తి పట్టణ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జనరల్ ఆస్పత్రికి వచ్చిన ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన ఓ వ్యక్తి బైక్ గంట వ్యవధిలోనే మాయమైంది. ఇప్పటికీ రికవరీ చేయలేదని బాధితుడు పేర్కొన్నాడు.
● కర్ణాటక నాగేపల్లి వద్ద ఉన్న సందీప్ విల్లాలో నివాసముంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో సుమారు రూ.25 లక్షలు విలువ చేసే బంగారం చోరీకి గురైంది. ఈ కేసు దర్యాప్తులోనూ పురోగతి లేదు.
● పుట్టపర్తి మున్సిపాలిటీ వెస్ట్ గేట్కు వెళ్లే దారిలో ఓ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు. ఇప్పటి వరకూ రికవరీ చేయలేదని బాధిత మహిళ వాపోతోంది.
మరిచే లోపు మరో ఘటన
పుట్టపర్తిలో చోరీల కలకలం.. నిత్య వార్తగా మారింది. ఒక ఘటన మరిచే లోపు మరో చోరీ వెలుగు చూస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (బుధవారం వేకువజాము 3.52 గంటల సమయంలో.. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం) పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి క్వార్టర్స్ ఎఫ్ బ్లాక్లో 9 ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. రూ.8.25 లక్షల నగదు, 34 తులాల బంగారాన్ని దుండగులు అపహరించారు. తన కుమార్తె పెళ్లి కోసం దాచిన మొత్తం బంగారాన్ని ఎత్తుకెళ్లారంటూ ఎలక్ట్రీషియన్ శ్రీనివాసులు కన్నీటి పర్యంతమయ్యారు.
సవాల్ విసురుతున్న దొంగలు
జిల్లాలో నిత్యమూ ఏదో ఒక చోట చోరీలు
ఇప్పటి వరకూ ఏ ఒక్క కేసులో
రికవరీ చూపని పోలీసులు
ఎస్పీ కార్యాలయానికి
కూతవేటు దూరంలోనే..
పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టాఫ్ క్వార్టర్స్లోని తొమ్మిది ఇళ్లలో దుండగులు ప్రవేశించి, విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. బుధవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. క్వార్టర్స్లోని మూడు బ్లాకుల్లో ఉన్న తొమ్మిది ఇళ్లల్లో ఏకకాలంలో బీభత్సం సృష్టించి రూ.9లక్షల నగదు, 34 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్ శ్రీనివాసులు ఒక్కడి ఇంట్లోనే రూ.8లక్షల నగదు, 29 తులాల బంగారు నగలను దుండగులు అపహరించారు. నగదు, బంగారాన్ని తన కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసి ఉంచినట్లు బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి దుండగుల వేలి ముద్రల ఆధారాల కోసం జల్లెడ పట్టారు. స్నిప్పర్ డాగ్ను రప్పించి దుండగుల కదలికలను పసిగట్టారు. ఆయా ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇదే ప్రాంతంలో కలెక్టర్ నివాసం ఉంటున్నారు. వీఐపీ ప్రాంతం కావడంతో భద్రత పటిష్టంగానే ఉంటోంది. అయినా వరుస చోరీలు చోటు చేసుకోవడంతో పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అతి తెలివిని

జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అతి తెలివిని