
జిల్లాలో వరుస హత్యలు
లేపాక్షి: భార్యపై అనుమానంతో ఓ యువకుడిని వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన ఘటన గురువారం లేపాక్షి మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన రవికుమార్ (37)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి అశ్వత్థప్పతో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో తన ఇంటికి సమీపంలో నివాసముంటున్న బంధువు ఆనంద్ కుటుంబంతో రవికుమార్ చనువుగా ఉండేవాడు. తరచూ ఇంటికి రాకపోకలు సాగిస్తుండడంతో తన భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న ఆనంద్ ఎలాగైనా రవికుమార్ను హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంతో తన సోదరుడు గోవిందప్పతో కలసి పథకం రచించాడు. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి స్థానిక రైతు లింగప్ప తోటలో మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపి రవికుమార్ను రప్పించుకున్నారు. ముగ్గురూ కలసి మద్యం సేవించారు. అదే సమయంలో మత్తులో జోగుతున్న రవికుమార్పై వేటకొడవలితో దాడి చేయడంతో మొండెం నుంచి తల వేరుపడింది. అనంతరం మృతదేహాన్ని నీటి గుంతలో గొయ్యి తీసి పాతిపెట్టారు. బుధవారం తెల్లవారినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో అశ్వత్థప్ప ఆరా తీయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆనంద్, గోవిందప్ప ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడడంతో నీటి గుంతలో పాతిపెట్టిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. ఘటనపై మరింత లోతైన విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్ర తెలిపారు.
భార్యపై అనుమానంతో లేపాక్షి
మండలంలో ఓ యువకుడి హత్య
మంగళవారం రాత్రి వేటకొడవళ్లతో నరికి హతమార్చిన వైనం
పోలీసుల అదుపులో నిందితులు
జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలో గురువారం తూముకుంట వాసి హత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. భార్యపై అనుమానంతో ఓ యువకుడిని మరొకరితో కలసి రెండు రోజుల క్రితం భర్త మట్టుబెట్టగా గురువారం వెలుగు చూసింది. మరో ఘటనలో జిల్లా సరిహద్దున కర్ణాటక ప్రాంతంలో మద్యం మత్తులో చోటు చేసుకున్న గొడవలో హిందూపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి హతమయ్యాడు.
మద్యం మత్తులో...
హిందూపురం/గౌరిబిదనూరు: మండల పరిధిలోని తూముకుంట చెక్పోస్టు ప్రాంతంలో నివాసముటున్న రవికుమార్ (37) జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలో దారుణ హత్యకు గురయ్యాడు. వెల్డర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న అతనికి భార్య అనుపమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిస కావడంతో అతనిలో మార్పు తీసుకువచ్చేందుకు భార్య విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా మార్పు రాకపోవడంతో 4 ఏళ్ల క్రితం భర్తను వదిలేసి పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె రాలేదు. దీంతో ఒంటరిగా మారిన రవికుమార్ ఎప్పుడూ మద్యం మత్తులో జోగుతూ జులాయిగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలోని గంగోత్రి బార్ వద్దకు గురువారం వెళ్లిన అతను సాయంత్రం మద్యం మత్తులో జోగసాగాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న హిందూపురంలోని బాపూజీనగర్కు చెందిన ఆటో డ్రైవర్ అశోక్తో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరూ పరస్పరం కొట్టుకున్నారు. గొడవ తారస్థాయికి చేరుకోవడంతో ఆటో డ్రైవర్ బీరు బాటిల్ ముక్క తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. వరుస పోట్లకు గురి కావడంతో రవికుమార్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న కర్ణాటకలోని గౌరిబిదనూర్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీలను సేకరించారు. ఘటనపై గౌరిబిదనూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

జిల్లాలో వరుస హత్యలు

జిల్లాలో వరుస హత్యలు