
ఏడీఏల బదిలీ జాబితా విడుదల
● అనంతపురం, హిందూపురం పెండింగ్
అనంతపురం అగ్రికల్చర్: బదిలీల ప్రక్రియలో భాగంగా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ)ల జాబితా ఎట్టకేలకు వెల్లడైంది. బదిలీల చివరి రోజైన ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 133 మందితో జాబితా విడుదల చేశారు. అయితే వెనువెంటనే జాబితాను వెనక్కి తీసుకున్నారు. 17 రోజుల తర్వాత తాజాగా బుధవారం అర్ధరాత్రి రెండో సారి 110 మందితో జాబితా విడుదల చేశారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది పరిస్థితి తేలలేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ చేపట్టడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలుకుబడి, ప్రజాప్రతినిధుల సిఫారసులు, పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొదటి జాబితాలో 9 మంది ఏడీఏలను బదిలీ చేస్తూ జాబితా ఇచ్చారు. తాజాగా విడుదలైన జాబితాలో ఏడుగురు ఏడీఏలను బదిలీ చేశారు. అత్యంత కీలకమైన అనంతపురం డివిజన్తో పాటు హిందూపురం డివిజన్లకు ఏడీఏలను కేటాయించకపోవడం గమనార్హం.
బదిలీలు ఇలా...
ఎస్.సత్యనారాయణ కదిరి నుంచి ఉరవకొండకు, ఎం.చెంకలరాయుడు తాడిపత్రి నుంచి కర్నూలు జిల్లా ఆలూరు, బి.క్రిష్ణమీనన్ మడకశిర నుంచి పెనుకొండ, జే.సనావుల్లా పుట్టపర్తి డీఆర్సీ నుంచి కదిరి, ఎల్.లక్ష్మానాయక్ రాయదుర్గం నుంచి ధర్మవరం, ఎస్.పద్మజ ఉరవకొండ నుంచి రాయదుర్గం, ఎం.రవి అనంతపురం నుంచి తాడిపత్రి బదిలీ అయ్యారు. అనంతపురం నుంచి రవి బదిలీ కాగా ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. హిందూపురంలో ఉన్న అల్తాఫ్ అలీఖాన్ను ఎక్కడకు బదిలీ అయ్యారనే విషయం అనేది కూడా తేలలేదు. ధర్మవరం ఏడీఏ క్రిష్ణయ్యను కూడా ఎక్కడకు బదిలీ చేశారనేది తేలాల్సివుంది. అనంతపురం ఏడీఏ స్థానానికి అల్తాఫ్ అలీఖాన్, క్రిష్ణయ్యల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదెక్కడి టోల్ బాదుడు?!
చిలమత్తూరు: టోల్ ప్లాజాల వద్ద ఒకే ఎంట్రీకి రెండేసి సార్లు బిల్లులు డెబిట్ అవుతుండడంతో పలువురు వాహనదారులు మండిపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంది పుచ్చుకున్న ప్రస్తుత రోజుల్లో టోల్ప్లాజాల వద్ద వాహనాల ఎంట్రీని సులభ తరం చేసేందుకు ఫాస్ట్టాగ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాహనాలు టోల్ గేట్లోకి ప్రవేశించగానే ఫాస్ట్టాగ్ స్కాన్ అయి దాని ద్వారా ఎంట్రీకి సంబంధించిన రుసుం సదరు వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. ఈ క్రమంలో గురువారం హిందూపురానికి చెందిన అయూబ్ తన వాహనంలో వెళుతూ చోళసముద్రం టోల్ప్లాజా దాటారు. రెండు నిముషాల వ్యవధిలో రెండు సార్లు అతని బ్యాంక్ ఖాతా నుంచి టోల్ప్లాజా రుసుం డెబిట్ కావడంతో కంగుతిన్న అయూబ్ వెంటనే టోల్ప్లాజా సిబ్బందిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో జరిగిన మోసాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నెల 19న బాగేపల్లి టోల్ప్లాజా వద్ద కూడా ఇలాగే తన బ్యాంక్ ఖాతా నుంచి రెండు సార్లు నగదు డెబిట్ అయిందని వివరించారు. జరిగిన మోసంపై తాను సోషల్ మీడియా వేదికగా వాహనదారులను చైతన్య పరుస్తూ పోస్టు చేసినట్లు వివరించారు. టోల్ప్లాజా యాజమాన్యం దోపిడీపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.