
సర్దుకుంటున్న రెడ్డెప్పశెట్టి
చిలమత్తూరు: నదిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మించడం...ఈడీ అటాచ్ చేసిన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను స్వాధీనం చేసుకోవడం... ఉద్యానశాఖ ద్వారా అక్రమంగా పాలీహౌస్, ఫారంపాండ్లను మంజూరు చేయించుకోవడం... విద్యుత్ చౌర్యం.. ఇలా..రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమ బాగోతాలు అన్నీఇన్నీ కావు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆయన చేసిన అవినీతి, అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తేగా అధికారులూ చర్యలకు సిద్ధమయ్యారు. కేసులన్నీ ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటుండటంతో భూములన్నీ విక్రయించి పలాయనం చిత్తగించేందుకు రెడ్డెప్పశెట్టి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ బడా రియల్టర్తో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. అయితే ప్రభుత్వ భూములను కలుపుకొని ధర చెప్పడంతో ఆ రియల్టర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎవిక్షన్్ నోటీసు ఇవ్వగానే కోర్టుకు...
అక్రమాల్లో ఆరితేరిన రియల్టర్ రెడ్డెప్పశెట్టి.. ఏదైనా ఇబ్బంది కలిగినా తప్పించుకునేందుకు సైతం ముందే దారులు వెదికి ఉంచుకున్నారు. అందువల్లే అతనిపై అన్ని కేసులు నమోదైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు.
● చిత్రావతి నదిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మించడంతో ఇరిగేషన్ అధికారులు చిలమత్తూరు పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అనంతరం ఎవిక్షన్ నోటీసు ఇవ్వగా..రెడ్డెప్పశెట్టి వెంటనే కోర్టును ఆశ్రయించారు. తాను రైతుల కోసం బ్రిడ్జి నిర్మించానని... దాన్ని తొలగిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందంటూ కోర్టు ఎదుట వాదన వినిపించారు. అయినా ఆరు నెలలు గడువు కావాలంటూ సమయం కోరారు.
● విద్యుత్ చౌర్యానికి సంబంధించి రూ.13 లక్షలు చెల్లించాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు నోటీసు ఇవ్వగా..దీనిపైనా రెడ్డెప్పశెట్టి కోర్టుకు వెళ్లాడు. అంత చెల్లించలేనని, నామమాత్రం ఇస్తానంటూ కోర్టుకు తెలిపాడు. ఇక తన పొలానికి దారి ఇవ్వలేదని ఓ రైతు చిలమత్తూరు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులోనూ ఆయనపై ఇప్పటి వరకూ చర్యలు లేవు. అలాగే రైతులను మోసం చేసి వారి పేరిట డ్రిప్ ఇరిగేషన్ కింద పథకాలు తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి సరిపెట్టారు. ఈడీ అటాచ్ చేసిన లేపాక్షి హబ్ భూములను స్వాధీనం చేసుకుని దర్జాగా అనుభవిస్తున్నా... ఇప్పటివరకూ చర్యలు లేవు.
అధికారుల అంగీకారం వెనుక భారీ డీల్!
భూములు విక్రయించాలని నిర్ణయించుకున్న రెడ్డెప్పశెట్టి...తన అక్రమాలపై ఇప్పటికే నోటీసులిచ్చిన అధికారులకు ఆరునెలలు గడువు ఇవ్వాలని లేఖ రాశారు. అందుకు అధికారులు సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. దీంతో ఆలోపు భూములన్నీ విక్రయించి బయటపడదామని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉంటున్న రెడ్డప్పశెట్టి ఇక్కడి అధికారులను పిలిపించుకుని డీల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా...రెవెన్యూశాఖ కనీసం కోర్టుకు స్థాయి అధికారి సహకరిస్తున్నట్లు ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.
తప్పులు మెడకు చుట్టుకోవడంతో
తప్పించుకునే ప్రయత్నం
భూములన్నీ అమ్మకానికి పెట్టిన వైనం!
లేపాక్షి హబ్ భూములు, ప్రభుత్వ భూములనూ విక్రయించేలా ప్లాన్

సర్దుకుంటున్న రెడ్డెప్పశెట్టి