
గుమ్మనూరు జయరామ్ వ్యాఖ్యలు సరికాదు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
రొద్దం: స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యాక వైఎస్సార్సీపీ వారి అంతు చూస్తామని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. ఆదివారం బొక్సంపల్లి గ్రామ పంచాయతీలో ‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ లీడర్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి గత ప్రభుత్వం.. ప్రస్తుత ప్రభుత్వం పాలనలో తేడాను బేరీజు వేసుకోవాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2019లో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ ఇచ్చి గెలిపించుకుని.. మంత్రి పదవి కట్టబెట్టారని గుర్తు చేశారన్నారు. ఆయన పెట్టిన రాజకీయ భిక్షతోనే జయరామ్ ఎదిగారన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. టీవీ చానెల్ చర్చావేదికలో ఓ జర్నలిస్టు మాట్లాడిన మాటను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్కు అంటగట్టి దుష్ప్రచారం చేశారన్నారు. ఇటీవల మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ‘రప్పా.. రప్పా’ అని డైలాగ్ చెప్పగానే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి టీడీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్లకార్డులు ప్రదర్శించినపుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. హోం మంత్రి అసత్య ఆరోపణలతో వైఎస్ జగన్మోన్రెడ్డిని విమర్శించడం మానుకోవాలన్నారు. మీరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి.. మీరే మాపై బురద చల్లాలని చూస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రత్నమ్మ, పార్టీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, నాయకులు విశ్వనాథ్రెడ్డి, ఎన్.నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, ప్రసాద్రెడ్డి, జెట్టి శ్రీనివాస్రెడ్డి, చిలకల రవి, హరిన లక్ష్మన్న, గోవర్ధన్రెడ్డి, బోయ మారుతి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామన్ తేదీ వేసేలా
చర్యలు తీసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా పాఠశాల సహాయకులకు (హిందీ, తెలుగు) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిలీవింగ్ తేదీ కామన్గా వేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్యూపీపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం డీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. డీఈఓను కలిసిన వారిలో ఆర్యూపీపీ జిల్లా గౌరవాధ్యక్షులు సి.ఎర్రిస్వామి, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వి.హనుమేష్, జి.తులశిరెడ్డి ఉన్నారు.
ట్యాబ్లు, పుస్తకాలు వెనక్కు ఇస్తేనే సర్టిఫికెట్లు
● బాలికల ఉన్నతపాఠశాల సిబ్బంది హుకుం
పెనుకొండ: మీ వద్దనున్న ట్యాబులు, పాఠ్యపుస్తకాలు వెనక్కు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఉన్నతపాఠశాల సిబ్బంది హుకుం జారీ చేస్తున్నారు. దీంతో సర్టిఫికెట్లు అందక విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పెనుకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో 2024–25 విద్యా సంవత్సరం 120 మంది విద్యార్థులు పదో తరగతి చదివారు. పరీక్షల్లో ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లాల్సి ఉంది. ఇందుకు అవసరమైన టీసీ, స్టడీ, కాండక్ట్ సర్టిఫికెట్ల కోసం ఉన్నత పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు వింత అనుభవం ఎదురైంది. మీకు ఇదివరకు ఇచ్చిన ట్యాబులు, పదో తరగతి పాఠ్య పుస్తకాలు వెనక్కు ఇచ్చి.. మీ సర్టిఫికెట్లు తీసుకెళ్లండంటూ క్లర్క్ చెబుతున్నారు. ఇది హెచ్ఎం ఆర్డర్ అని అంటున్నారు. మీరు వెనక్కు ఇచ్చిన స్టడీ మెటీరియల్ను ప్రస్తుత విద్యాసంవత్సరపు టెన్త్ విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. ఒక వేళ వాటిని తెచ్చివ్వకపోతే సర్టిఫికెట్టు ఇచ్చేది లేదని చెబుతుండటంతో క్లర్క్తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గొడవకు దిగుతున్నారు.
వెనక్కివ్వాలని ఎలా అడుగుతారు?
స్టడీ మెటీరియల్ వెనక్కు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని మెలిక పెట్టడంపై ఎంఈఓ సుధాకర్, డీవైఈఓ పద్మప్రియను వివరణ కోరగా.. ట్యాబులు, పాఠ్యపుస్తకాలు వెనక్కు ఇవ్వాలని ఎలా అడుగుతారు? అలాంటి ఆదేశాలు ఏవీ లేవని అన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో హెచ్ఎంతో మాట్లాడి కనుక్కుంటామన్నారు.

గుమ్మనూరు జయరామ్ వ్యాఖ్యలు సరికాదు