
‘రాప్తాడు’ను ఎడారిగా మార్చకండి
● రైతు సంఘం నాయకుల డిమాండ్
● హంద్రీ–నీవా లైనింగ్ పనులు ఆపాలంటూ ఆందోళన
కనగానపల్లి: జిల్లాకు ప్రధాన సాగునీటి ప్రాజెక్టుగా ఉన్న హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టి వెనుకబడిన రాప్తాడు నియోజకవర్గాన్ని ఎడారిగా మార్చరాదంటూ కూటమి ప్రభుత్వాన్ని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహదేవ డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా కనగానపల్లి మండలం బద్దలాపురం వద్ద హంద్రీ–నీవా కాలువలో చేపట్టిన లైనింగ్ పనులను సోమవారం రైతు సంఘం, సీపీఐ నాయకులు పరిశీలించి, అక్కడే రైతులతో కలసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హంద్రీ–నీవా కాలువ ద్వారా అందుతున్న నీటితోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంతమేర భూగర్భ జలాలు పెంపొందాయన్నారు. ప్రస్తుతం ఈ నీటి ద్వారానే రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు లక్ష ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో కుప్పం ప్రాంతానికి నీరు తీసుకెళ్లాలన్న ఉద్ధేశంతో కాలువకు సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ పనులు చేపట్టడం కుట్రపూరితమని మండిపడ్డారు. ఫలితంగా రాప్తాడు నియోజకవర్గంతో పాటు చుట్టు పక్కల ఉన్న సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగుభూములన్నీ బీళ్లుగా మారి రాప్తాడు నియోజవర్గం ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. సీఎం చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు. హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు వెంటనే ఆపకపోతే ప్రజా సంఘాలు, రైతులతో కలసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందు, నాయకులు రామాంజినేయులు, మాదన్న, ఆదినారాయణ, సీపీఐ నాయకులు బాలరాజు, మల్లికార్జున, నాగరాజు, ప్రసాద్, వెంకటలక్ష్మి, పలువురు రైతులు పాల్గొన్నారు.
జీఓ 117 రద్దు చేయాలి : ఏపీటీఎఫ్
పెనుకొండ రూరల్: జీఓ నంబర్ 117ను వెంటనే రద్దు చేయాలంటూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రయోగాలు వీడాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొడూరు శ్రీనివాసులు, జోనల్ అధ్యక్షుడు మల్లికార్జున, రవిచంద్ర, గోపాల్, వెంకటరమణ, ఆంజనేయులు, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.
నీటి సంపులో పడి వ్యక్తి మృతి
పరిగి: మండలంలోని మోదా పంచాయతీ పరిధిలోని చెర్లోపల్లి సమీపంలో ఉన్న ఓ మామిడి తోటలో నీటి సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం పట్టణానికి చెందిన టీడీపీ నేత నంజప్పకు చెందిన మామిడి తోటలో మడకశిర మండలంలోని కల్లుమర్రి గ్రామానికి చెందిన గంగాధరప్ప(35)తో పాటు మరో ఇద్దరు పనిచేస్తున్నారు. రోజూ స్వగ్రామం నుంచి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లేవారు. ఈ క్రమంలో సోమవారం పనికి వచ్చిన గంగాధరప్ప నీటిని వదిలేందుకు సంప్ వద్దకు వెళ్లాడు. సాయంత్రమైనా ఆయన తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన మిగిలిన ఇద్దరు కూలీలు అక్కడకు వెళ్లి పరిశీంచారు. అప్పటికే నీటిలో మృతదేహం తేలియాడుతుండడం గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ వెంకటేశులు తెలిపారు. కాగా, గంగాధరప్పకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నట్లు సమాచారం.

‘రాప్తాడు’ను ఎడారిగా మార్చకండి

‘రాప్తాడు’ను ఎడారిగా మార్చకండి