
రైతులకు పరిహారం వెంటనే అందజేయాలి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశం
ప్రశాంతి నిలయం: జిల్లాలో పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల నిర్మాణం కోసం అదనపు భూసేకరణ చేశామని, రైతుల వివరాలు సేకరించి వెంటనే నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల కోసం చేపట్టిన భూసేకరణపై ఆరా తీశారు. భూసేకరణ పనుల్లో అలసత్వం పనికిరాదని, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూమిని సబ్డివిజన్ చేసేటప్పుడు తహసీల్దార్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, ఆర్డీఓలు సువర్ణ, శర్మ, ఆనంద్ కుమార్, మహేష్, తహసీల్దార్లు కళ్యాణ్ చక్రవర్తి, బాలాంజనేయులు, వెంకటేష్, రెడ్డిశేఖర్, మురళికృష్ణ, మహబూబ్ బాషా, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి
● పౌర హక్కుల దినోత్సవ సభలో
ఎస్పీ రత్న
నల్లమాడ: సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, వాటికి భంగం కలిగించకుండా వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ వీ. రత్న అన్నారు. పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రత్న... గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఒకరి ఇంటి ప్రాంగణంలో చెత్త వేయడం, దేవాలయం, బార్బర్ షాపులోకి అనుమతించకపోవడం, రెండు గ్లాసుల పద్ధతి అమలు చేయడం, దళితులను కులం పేరుతో దూషించి దాడి చేయడం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రిందకు వస్తాయన్నారు. మహిళలు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో చట్టం కింద శిక్షార్హులవుతారన్నారు. ఆడ పిల్లలకు యుక్త వయస్సు వచ్చాకే వివాహం చేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం డీవీఎంసీ సభ్యులు, న్యాయవాది కే. వీరనారాయణ, పుట్టపర్తి డీఎస్పీ విజయ్కుమార్, సీఐ నరేంద్రరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సునీత, ఏపీఎం గోపాల్, సీపీఎం మండల కార్యదర్శి గోవిందు, పలువురు మహిళలు మాట్లాడారు.

రైతులకు పరిహారం వెంటనే అందజేయాలి