స్టేషన్‌ పాయింట్ల నమోదులో ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ పాయింట్ల నమోదులో ఇష్టారాజ్యం

Jun 1 2025 12:22 AM | Updated on Jun 1 2025 12:22 AM

స్టేషన్‌ పాయింట్ల నమోదులో ఇష్టారాజ్యం

స్టేషన్‌ పాయింట్ల నమోదులో ఇష్టారాజ్యం

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా స్టేషన్‌ పాయింట్లు (పని చేస్తున్న స్కూల్‌) గరిష్టంగా 24కు మించి ఉండకూడదు. ఎనిమిదేళ్ల సర్వీసుకు (3వ కేటగిరీ) 24 పాయింట్లు వస్తాయి. ఆపైన 9–10 ఏళ్లు సీనియారిటీ ఉన్నా..గరిష్టంగా ఎనిమిదేళ్లకే పాయింట్లు పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. అయినా కొందరు టీచర్లు ఇష్టానుసారంగా నమోదు చేసుకున్నారు. సరి చేయాల్సిన మండల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా వందలాది మంది టీచర్లు ఇష్టానుసారంగా స్టేషన్‌ పాయింట్లు నమోదు చేసుకున్నారు. ఎస్జీటీ తెలుగులో 3,872 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకోగా...వీరిలో 84 మంది ఎస్జీటీలు స్టేషన్‌ పాయింట్లు 24కు పైగా వేసుకున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎడిట్‌ చేయాలని డీఎస్‌ఈ నుంచి డీఈఓలు, ఎంఈఓలకు ఆదేశాలు వచ్చాయి.

పట్టించుకోని ఎంఈఓలు..

ఎంఈఓల లాగిన్లకు వచ్చిన దరఖాస్తులను..సంబంధిత టీచర్లతో హార్డ్‌కాపీలు తెప్పించుకుని వారు వేసుకున్న పాయింట్లను పరిశీలించి ఆమోదం తెలపాలి. చాలా మండలాల్లో ఎంఈఓలు పట్టించుకోని కారణంగా ఈ ప్రక్రియ సరిగా జరగలేదు. కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు కంప్యూటర్ల ముందు కూర్చుని వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగానే నిర్ధారించారు. తర్వాత డీఈఓ లాగిన్‌కు వచ్చిన దరఖాస్తులను కూడా కార్యాలయ సిబ్బంది అలానే నిర్ధారించి పంపారు. ఫలితంగానే వందలాది మంది టీచర్లకు స్టేషన్‌ పాయింట్లలో తేడా వచ్చింది. వీటిని సరిదిద్దుతున్నామని డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు.

‘ప్రత్యేక’ పాయింట్లలోనూ అడ్డదారులు..

కొందరు టీచర్లు అనుకూలమైన స్థానాలకు వచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పుట్టుకతో వచ్చిన శారీరక వైకల్యాలు, వ్యాధుల బారిన పడిన వారు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో ఉన్నా, ప్రత్యేక పాయింట్లు పొందినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే..లేని రోగాలను సృష్టించుకుని అడ్డదారుల్లో నకిలీ సర్టిఫికెట్లు పొంది పాయింట్లు పొందుతుండడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. డి.హీరేహాళ్‌ మండలంలో పని చేస్తున్న ఓ ఎస్జీటీ ఇటీవల బైకుపై నుంచి కిందకు పడ్డాడు. ఇదే అదనుగా తనకు మేజర్‌ సర్జరీ జరిగినట్లు ప్రచారం చేసుకుని నకిలీ సర్టిఫికెట్‌ తెచ్చుకుని.. ప్రత్యేక పాయింట్లు పొందాలని చూస్తున్నాడు. ఈయన వ్యవహారంపై కొందరు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి..

బదిలీలు, ప్రమోషన్ల కోసం తీసుకున్న మెడికల్‌ సర్టిఫికెట్లను పున:పరిశీలించాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ ఎవరైనా మెడికల్‌ సర్టిఫికెట్లను దుర్వినియోగపరిస్తే.. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎక్కువ పాయింట్లు నమోదు చేసుకున్న 84 మంది ఎస్జీటీలు

అధికారుల పరిశీలనలో వెలుగులోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement