ద్విచక్రవాహనాల ఢీ | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనాల ఢీ

Jun 1 2025 12:22 AM | Updated on Jun 1 2025 12:22 AM

ద్విచ

ద్విచక్రవాహనాల ఢీ

ముగ్గురికి గాయాలు

మడకశిర రూరల్‌: యు.రంగాపురం వద్ద శనివారం ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు... జీవీపాళ్యం పంచాయతీ బంద్రేపల్లి నుంచి శివన్న లక్ష్మీదేవి అనే మహిళతో కలిసి దిచక్రవాహనంలో మడకశిరకు బయల్దేరాడు. ఇదే సమయంలో యూ రంగాపురం చెందిన ఖాసీమ్‌ పని నిమిత్తం బైక్‌పై వెళ్తున్నాడు. సరిగ్గా రోడ్డు క్రాస్‌లోకి రాగానే రెండు ద్విచక్రవాహనాలు వేగం అదుపు చేసుకోలేక ఢీకొన్నాయి. శివన్న, ఖాసీమ్‌లకు తీవ్ర గాయాలు కాగా.. లక్ష్మీదేవి స్వల్పంగా గాయపడింది. స్థానికులు గమనించి 108కు ఫోన్‌ చేస్తే ఎంతసేపటికీ అంబులెన్స్‌ చేరుకోలేదు. ఆలస్యమవుతుండడంతో బాడుగకు వాహనం మాట్లాడుకుని కుటుంబ సభ్యులు మడకశిర ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం శివన్న, ఖాసీమ్‌ను మెరుగైన వైద్యం కోసం హిందూపురం పంపించారు.

వివాహిత బలవన్మరణం

అదనపు కట్నం వేధింపులే కారణం

ధర్మవరం అర్బన్‌: అదనపు కట్నం కోసం అత్తింటివారు పెడుతున్న వేధింపులు భరించలేక వివాహిత తన పుట్టింటిలో బలవన్మరణానికి పాల్పడింది. ధర్మవరం టూటౌన్‌ సీఐ రెడ్డప్ప వివరాల మేరకు... కడప జిల్లా వేంపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లెక్చరర్‌ చిన్న నరసింహులుకు ధర్మవరంలోని శాంతినగర్‌కు చెందిన భాగ్యలక్ష్మి(31)తో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెళ్లయిన కొంతకాలం తర్వాత నుంచి అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు సుబ్బమ్మ, పెద్ద నరసింహులు వేధించడం మొదలు పెట్టారు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా చేశారు. అయినా మెట్టినింటి వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో భాగ్యలక్ష్మి 20 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. మనోవేదనకు గురైన భాగ్యలక్ష్మి శనివారం ఇంట్లోనే ఉరివేసుకుంది. మృతురాలి తల్లి కొండమ్మ ఫిర్యాదు మేరకు మెట్టినింటి వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

ఓడీచెరువు: పగడాలవారిపల్లికి చెందిన కొక్కంటి శంకరప్ప (54) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మే 29న శంకరప్ప గౌనిపల్లిలో మద్యం తాగి పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుమారుడు అతడిని ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఐదున్నర గంటలకే శంకరప్ప ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం ఊరి చివరన ఓ చెట్టుకు ఉరికి వేలాడుతూ ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించారు. కుమారుడు గణేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పెళ్లి పేరుతో వంచన

నిందితుడికి రిమాండ్‌

కదిరి టౌన్‌: పెళ్లి పేరుతో వంచన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. ఎన్‌పీకుంట మండలం గంగిరెద్దులోళ్లపల్లికి చెందిన హరిప్రసాద్‌రెడ్డి కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ప్రైవేట్‌ విద్యుత్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇతను గతంలో కదిరి పట్టణంలోని ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఒంటరి మహిళను పెళ్లి చేసుకుంటానని దగ్గరై.. గర్భవతిని చేసిన తర్వాత ప్లేటు ఫిరాయించాడు. దీంతో బాధిత మహిళ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు హరిప్రసాద్‌ను శనివారం రాయచోటి రోడ్డు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి సమీపంలో అరెస్టు చేసి కదిరి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి మెజిస్ట్రేట్‌ 14 రోజులు రిమాండ్‌కు విధించడంతో అతన్ని అనంతపురం సబ్‌ జైలుకు తరలించినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

ద్విచక్రవాహనాల ఢీ 1
1/1

ద్విచక్రవాహనాల ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement