
ఆర్డీటీని కాపాడుకుందాం
అనంతపురం అర్బన్: బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధికార ప్రతినిధి అక్కులప్ప అన్నారు. ఆర్డీటీని కాపాడుకోవాలంటూ బుధవారం కలెక్టరేట్ సమీపంలోని ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి ఎస్సీ సంఘాల నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్ను ఆయన చాంబర్ వద్ద నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధులు ఆగిపోతే పేదల బతుకుల్లో వెలుగులు ఉండవన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మన్న, ధనుంజయ, శ్రీనివాసులు, రవి, యల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.
సేవ్ ఆర్డీటీ..
అనంతపురం అర్బన్: పేదల అభ్యున్నతే లక్ష్యంగా జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీయూడబ్ల్యూజే నాయకులు అన్నారు. ఆర్డీటీకి విదేశీ నిధులు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవ్ ఆర్డీటీ నినాదంతో బుధవారం కలెక్టరేట్ సమీపంలోని ఫాదర్ ఫెర్రర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, గౌరవాధ్యక్షుడు భోగేశ్వరరెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు జగదీష్, ఫొటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డానియల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేపీ కుమార్, నాయకులు, జర్నలిస్టులు రామచంద్ర, చౌడప్ప, అక్కులప్ప, భూమిరెడ్డి, ప్రసాద్, ఆనందవర్ధన్, శేషాద్రి శేఖర్, బన్సీలాల్, రాజశేఖర్, వెంకటరెడ్డి, సాయి, భరత్, నబిరరూల్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో..
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా కల్పతరువు అయిన ఆర్డీటీ సంస్థను రక్షించుకుందామని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆర్డీటీ ప్రధాన కార్యాలయం వద్ద ఆర్డీటీ సేవలను కొనసాగించాలని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోతే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎంఎం మహబూబ్ బాషా, జాకీర్ హుస్సేన్, టిప్పుసుల్తాన్, నజీర్, ప్రజాబలం గోగుల మూర్తి, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ, జేఏసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వాల్మీకి సంఘం రాయలసీమ ఇంచార్జి సాంబ, మసూద్, సమీముల్లా, నజీర్, వన్నూరు, బాష, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.