
4న ‘వెన్నుపోటు దినం’
పెనుకొండ రూరల్: ‘సూపర్ సిక్స్’ పథకాల పేరుతో ప్రజలను నట్టేట ముంచిన కూటమి సర్కార్ చర్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ స్థానిక పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను నమ్మించి మోసగించిందన్నారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీల అమలుకు అడుగులు వేయలేదన్నారు. ముఖ్యంగా సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్యూరెన్స్ వంటి పథకాలు అమలు చేయకుండా కార్మికులు, రైతులు, మహిళలు..ఇలా అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. ముఖ్యంగా యువతకు ఈ ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూటమి పార్టీల నేతల మోసాన్ని వివరించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉషశ్రీచరణ్ కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు నరసింహులు, సుధాకర్ రెడ్డి, నాయకులు వైశాలి జయశంకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చెన్నకేశవులు, గణప్ప, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరించిన ఉషశ్రీచరణ్