
రోడ్డుపై వరినాట్లు!
రొళ్ల: చిన్నపాటి వర్షానికే బురదమయమవుతున్న రహదారి.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పైగా రోడ్డుపై నీరు నిల్వ ఉండిపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ఎన్నిసార్లు విన్నవించినా అధికారుల్లో చలనం లేదు. దీంతో మహిళలు రోడ్డుపై వరినాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని హెచ్టీ హళ్లి–సీసీ గిరి ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనికి తోడు ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షానికి రహదారి బురదమయంగా మారింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థలేని కారణంగా వర్షపునీరు ప్రధాన రోడ్డు మధ్యలోనే నిలిచింది. వర్షపు నీరు రోజుల తరబడి రోడ్డుపైనే నిలిచిపోవడంతో దోమలు వ్యాప్తి చెందాయి. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించడంతో పాటు రోడ్డుపై ఏర్పడిన గుంతలు పూడ్చాలని ఆర్అండ్బీ అధికారులను వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం మల్లినమడుగు పంచాయతీ కేంద్రంలో మహిళలు హెచ్టీ హళ్లి–సీసీ గిరి ప్రధాన రహదారి మధ్యలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపట్టి రోడ్డు మధ్యలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రోడ్డు సమస్య తీర్చాలని మహిళల వినూత్న నిరసన