
ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ప్రవాస భారతీయుడిని మోసం
ఎన్ఆర్ఐని చీటింగ్ చేసిన కేసులో భారీ ట్విస్టులు
● నిందితుడిని పోలీస్స్టేషన్లో పెట్టి స్థిరాస్తుల బదలాయింపు
● పోలీసుల ఆధ్వర్యంలోనే నిందితుడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి
● కేసు నమోదు చేసిన వారానికి అరెస్టు చూపించిన పోలీసులు
● పోలీసు అధికారులకు రూ.50 లక్షల డీల్ కుదిర్చిన టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రవాస భారతీయుడైన ఆర్వీన్ మహేంద్రకర్ను పుట్టపర్తికి చెందిన సత్యనారాయణ రాజు రూ.12.50 కోట్ల మేర మోసం చేశారు. ఈ కేసులో బాధితుడికి పెద్దగా లాభం చేకూరకపోగా నిందితుడి నుంచి పోలీసులకు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు, ద్వితీయశ్రేణి నాయకులకు బాగా లబ్ధి కలిగింది.
పోలీసులకు రూ.50 లక్షల డీల్
ఎన్ఆర్ఐ మోసపోయిన కేసులో పోలీసులకు రూ.50 లక్షల డీల్ కుదిరినట్టు తెలిసింది. ఈ నెల 22న బాధితుడి ఫిర్యాదు మేరకు సత్యనారాయణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. 28వ తేదీ వరకు అరెస్టు చూపించలేదు. ఈ ఏడు రోజుల పాటు నిందితుణ్ని స్టేషన్లో హింసించి.. లొంగదీసుకుని దారికి తెచ్చుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు, ఒక మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారు. తాము చెప్పినట్టు చేస్తే మీకు రూ.50 లక్షలు ఇస్తామని టీడీపీ నాయకులు పోలీసు అధికారికి చెప్పడంతో తలూపిన సదరు అధికారి బాధితుణ్ని గోప్యంగా ఉంచి.. చేయాల్సిందంతా చేశారు.
ఆస్తుల బదలాయింపు
నిందితుడి పేరిట భారీగా భూములు, స్థలాలు ఉన్నాయి. వీటిని కొట్టేయాలనేదే ఆలోచన. పథకంలో భాగంగా అరెస్టుకు ముందే నిందితుడి పేరున ఉన్న కొన్ని భూములు ఓ మహిళ (ఎన్ఆర్ఐ భార్య) పేరిట బదలాయించారు. ఈమె పుట్టపర్తిలో పూల వ్యాపారం చేసుకునేది. వీసా సమస్య వస్తుందని గతంలో మహేంద్రకర్కు సదరు మహిళతో ప్రస్తుత నిందితుడు సత్యనారాయణరాజు పెళ్లి జరిపించారు. ప్రవాస భారతీయుడైన మహేంద్రకర్కు ఇక్కడి విషయాలు తెలియవు. దీంతో ఈమెను టీడీపీ నాయకులు, పోలీసులు భయపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. అనంతరం సత్యనారాయణరాజు పేరుపై ఉన్న ఆస్తులు బుక్కపట్నం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో (డాక్యుమెంటు నంబర్లు 1563, 1564, 1584) ఆమె పేరుపై బదలాయించారు. ఏకంగా పోలీసుల సమక్షంలోనే ప్రైవేటు ఎస్కార్టు వాహనాల్లో నిందితుణ్ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించారంటే పోలీసులు ఏ స్థాయిలో బరితెగించారో అంచనా వేయొచ్చు. ముందుగా ఆమె పేరుతో బదలాయించి.. ఆ తర్వాత తక్కువ ధరకు టీడీపీ నేతలు రాయించుకోవాలనేది ఎత్తుగడ. నిందితుణ్ని వారం రోజులు అరెస్టు చూపించకుండా చేసిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ఇక్కడ భారీగా లబ్ధిపొందిన పోలీసు అధికారిపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐతో కలిసి పోలీసు బాస్లకు వసూళ్లు చేసి పెట్టడంలోనూ ఈ అధికారికి ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. ప్రశాంతి నిలయానికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ అరాచకాలు సాయి భక్తులకు విస్మయం కలిగిస్తున్నాయి. ఎన్నో దేశాల నుంచి సాయి సన్నిధికి భక్తులు వస్తుంటారు. ఇలా పోలీసులే నిందితుల నుంచి వసూళ్లు మొదలెడితే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. తీవ్ర విమర్శలు రావడంతో పుట్టపర్తి పోలీసులు తమను తాము కాపాడుకునే పరిస్థితికి వచ్చారు.