
టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు
పుట్టపర్తి టౌన్: తమ సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే టీడీపీ నేతలు అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో డీఎస్పీ విజయ్కుమార్ను కలసి వినతి పత్రం అందజేసి, తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుట్టపర్తి మండలం బుగ్గపల్లి గ్రామానికి చెందిన నిడిమామిడప్పకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మూగవాడు, రెండో కుమారుడు జీవనాధారం కోసం అనంతపురానికి వలస వెళ్లాడు. నిడిమామిడప్పకు అదే గ్రామంలో 2007లో సర్వే నంబర్ 349లో అప్పటి ప్రభుత్వం రెండు సెంట్ల స్థలాన్ని మంజూరు చేస్తూ పట్టా ఇచ్చింది. 2023లో ఆర్టీటీ సౌజన్యంతో పునాది ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి పట్టా చెల్లదంటూ అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నలుగురు దౌర్జన్యానికి దిగారు. పోరంబోకు భూమిలో పునాదులు వేశారంటూ పెకలించి వేశారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే నిడిమామిడప్పకు అనుకూలంగా తీర్పు వెలువడింది. అయినా టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు. ఈ విషయంగా తమకు న్యాయం చేయాలంటూ గతంలో కలెక్టర్, ఎస్పీకు ఫిర్యాదు చేసినా న్యాయం చేకూరలేదని బాధితులు వివరించారు. ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నామని పేర్కొన్నారు. సమస్యపై స్పందించిన డీఎస్పీ విజయ్కుమార్ వెంటనే సంబంధిత సీఐకి ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
● జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 65 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేయాలని
ఎస్పీని వేడుకున్న బాధితులు
‘పోలీసు స్పందన’కు 65 వినతులు