
ప్రకృతి సిద్ధంగా మాగబెట్టాలి
పుట్టపర్తి అర్బన్: అరటి, మామిడి కాయలను ప్రకృతి సిద్ధంగా మాగబెట్టాలని పండ్ల వ్యాపారులకు ఫుడ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర సూచించారు. జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద, మార్కెటింగ్ ఏడీ నరసింహమూర్తితో కలసి సోమవారం కొత్తచెరువు మార్కెట్ యార్డులోని పండ్ల వ్యాపారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కాల్షియం కార్బైడ్ వాడకంతో కలిగే అనర్థాలను వివరించారు. మామిడి, అరటిని సహజ సిద్దంగా మగ్గబెడితే మంచి గిట్టుబాటు ధర లభ్యమవుతుందని, అంతేకాకుండా పండ్లు కూడా పాడవకుండా ఉంటాయన్నారు.
1న చెస్ పోటీలు
ధర్మవరం అర్బన్: వచ్చే నెల 3, 4 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–9 చెస్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా క్రీడాకారుల ఎంపిక కోసం మే 1న పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి నాగార్జున సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్మవరంలోని కళాజ్యోతిలో ఓపెన్ అండర్–9 కేటగిరిలో ఇద్దరేసి చొప్పున బాలబాలికలను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న చెస్ క్రీడాకారులు గురువారం ఉదయం 11గంటలకు పోటీలకు హాజరుకావాలి. పూర్తి వివరాలకు 99858 96901, 91770 32075లో సంప్రదించవచ్చు.
‘పురం’లో పెనుగాలుల బీభత్సం
హిందూపురం టౌన్: పట్టణంలో సోమవారం సాయంత్రం పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు వర్షంతో పాటు విపరీతమైన గాలులు వీచడంతో ఆర్పీజీటీ రోడ్డు, రైల్వే రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, హోండా షోరూం ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆ సమయంలో హోండా షోరూం వద్ద ఉన్న ఆటోతో పాటు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనదారులకు ప్రాణాపాయం తప్పింది. మేళాపురం సమీపంలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మేళాపురం వద్ద కాలువ పొంగి రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు పారింది. రైల్వే రోడ్డులో ఎక్కడికక్కడ నీరు నిలిచి పరిస్థితి దారుణంగా మారింది.