
పీఏబీఆర్లో తగ్గిన నీటిమట్టం
కూడేరు: ఇన్ఫ్లో లేక కూడేరు మండలం పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం తగ్గింది. ఆదివారం నాటికి రిజర్వాయర్లో 2.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. జలాశయం వద్ద ఏర్పాటైన అనంతపురం, శ్రీసత్యసాయి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్లకు రోజుకు సుమారు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లీకేజీ, ఆవిరి రూపంలో సుమారు 60 క్యూసెక్కుల వరకు నీరు బయటకు వెళుతోంది.
వృద్ధుడి బలవన్మరణం
సోమందేపల్లి: జీవితంపై విరక్తితో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామానికి చెందిన రామప్ప (68)కు బార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు వెంకటేష్ ఇంట్లోనే నివాసముంటున్న ఆయన శనివారం రాత్రి అందరితో కలసి భోజనం ముగించుకుని నిద్ర పోయాడు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు నిద్రలేచి చూసేసరికి ఓ గదిలో పైకప్పునకు ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతూ రామప్ప కనిపించాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమేష్బాబు ఆ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, రామప్ప ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.