
వడదెబ్బతో వ్యక్తి మృతి
గాండ్లపెంట: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం గాండ్లపెంటలో చోటుచేసుకుంది. మృతుని భార్య చంద్రకళ తెలిపిన వివరాల మేరకు...గాండ్లపెంట గంగమ్మ వీధిలో ఉండే ఎన్.మల్లికార్జున (55) కదిరిలోని ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తెల్లవారుజాము 5 గంటలకే విధుల్లోకి వెళ్తుంటాడు. అయితే శనివారం తెల్లవారుజామున మల్లికార్జున ఎంతకూ నిద్రలేవకపోవడంతో భార్య చంద్రకళ అతన్ని నిద్రలేపేందుకు ప్రయత్నించింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని తెలిపి ముఖం కడక్కునేందుకు లేచాడు. అయితే కళ్లుబైర్లు కమ్మాయని చెబుతూ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో భార్య ఇరుగూపొరుగు వారి సాయంతో మల్లికార్జునను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే అతను మృతి చెందాడు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మల్లికార్జున హోటల్లో పనిచేశాడని, ఎండవేడిమికి అనారోగ్యానికి గురై రాత్రి ఇంటికి రాగానే పడుకున్నాడని, ఈ క్రమంలో మృతి చెందాడని భార్య చెబుతోంది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.