
నూతన జిల్లాల ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహించాలి
పుట్టపర్తి అర్బన్: నూతన జిల్లాల ప్రాతిపదిక మేరకే తమకు రివైజ్డ్ రీడిప్లాయ్మెంట్ నిర్వహించాలని హెల్త్ అసిస్టెంట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగంను గురువారం కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో జరగనున్న రివైజ్డ్ రీడిప్లాయ్మెంట్ కౌన్సెలింగ్ను స్థానిక జిల్లాలోనే నిర్వహించాలని కోరారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నిర్వహిస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను మలేరియ సబ్ యూనిట్లు సైతం వర్తింపజేస్తూ జిల్లా మెరిట్ లిస్ట్ను ప్రదర్శించాలని కోరారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనల మేరకు కౌన్సిలింగ్ చేపడతామని హామీనిచ్చారు.
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
బుక్కరాయసముద్రం: మార్కులు సరిగా రాలేదంటూ తండ్రి మందలింపుతో మనస్తాపం చెంది డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బీకేఎస్ మండలం పొడరాళ్ల గ్రామానికి చెందిన రవి కుమార్తె వాణి (20) అనంతపురంలోని కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆన్లైన్ ద్వారా బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న ఆమె కోచింగ్కు నిర్వహించిన పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. విషయం తెలుసుకున్న తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

నూతన జిల్లాల ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహించాలి