
నువ్వే మాకు శరణం సాయీ..
ప్రశాంతి నిలయం: అశేష భక్తకోటి తమ ఇలవేల్పు సత్యసాయికి ఆత్మనివేదనను అర్పించుకున్నారు. నువ్వే మాకు శరణం అంటూ భక్తిగీతాలతో సాయిరాముడిని స్మరించారు. సత్యసాయి ఆరాధన మహోత్సవం గురువారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు సత్యసాయి మహాసమాధి చెంత సాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సత్యసాయి విద్యార్థులు, మిర్పురి సంగీత కళాశాల భజన బృందం సత్యసాయిని కీర్తిస్తూ పంచరత్న కీర్తనలు అలపించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద ప్రారంభోపన్యాసం చేశారు. విశ్వమానవాళిని అంధకారం నుంచి చైతన్యం వైపు నడిపిన ఆదిగురువు సత్యసాయి అని కొనియాడారు. అనంతరం ‘‘సత్యసాయి ప్రేమ ప్రవాహిని’’ యాత్ర పేరుతో ఏర్పాటు చేసిన ప్రచార రథాలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, నాగానంద, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండే తదితరులు ప్రారంభించారు. తర్వాత బ్రోచర్లను విడుదల చేశారు. నమిష్ పాండే మాట్లాడుతూ ప్రేమ వాహిని యాత్రను దేశ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తులు విజయవంతం చేయాలన్నారు. 2026 నవంబర్ 24 వరకూ దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తాయన్నారు. సాయంత్రం ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఉత్తర ఉన్ని కృష్ణ బృందం నిర్వహించిన సంగీత కచేరీ అందరినీ అలరించింది. వేడుకల్లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి, శెట్టి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హిల్వ్యూ స్టేడియంలో మహా నారాయణ సేవ
సత్యసాయి ఆరాధన మహోత్సవంలో భాగంగా గురువారం ప్రశాంతి నిలయంలో వేడుకలు ముగిసిన అనంతరం పట్టణంలోని హిల్వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యులతో కలసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 30 వేల మందికి సత్యసాయి అన్నప్రసాదాలతో పాటు చీర,దోవతీ వితరణ చేశారు.
శతజయంతి వేడుకలకు ఏర్పాట్లు
సత్యసాయి శతజయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు తెలిపారు. సత్యసాయి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని సత్యసాయి ప్రేమ ప్రవాహిని పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దేశంలోని సుమారు 500 జిల్లాల్లో 2.5 లక్షల కిలోమీటర్లు ప్రేమ ప్రవాహిని రథాలు ప్రచారం చేస్తాయన్నారు. సత్యసాయి అవతార వైభవం, సేవా మార్గాలు, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజలకు వివరిస్తూ చైతన్యపరుస్తాయన్నారు.
ప్రశాంతి నిలయంలో ఘనంగా
సత్యసాయి ఆరాధన మహోత్సవం
శతజయంతి వేడుకలను విజయవంతం చేయాలని రత్నాకర్రాజు పిలుపు

నువ్వే మాకు శరణం సాయీ..

నువ్వే మాకు శరణం సాయీ..

నువ్వే మాకు శరణం సాయీ..