బాధితుల పక్షాన నిలబడాల్సిన కొందరు ఖాకీలు సెటిల్‌మెంట్‌లే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏది చెబితే అది ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తున్నారు. బాధితులతో పద్ధతిగా మాట్లాడకుండా బూతులు లంఘించుకుంటున్నారు. డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తారో వారికే న్యాయం చేస్తున్నారు. | - | Sakshi
Sakshi News home page

బాధితుల పక్షాన నిలబడాల్సిన కొందరు ఖాకీలు సెటిల్‌మెంట్‌లే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏది చెబితే అది ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తున్నారు. బాధితులతో పద్ధతిగా మాట్లాడకుండా బూతులు లంఘించుకుంటున్నారు. డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తారో వారికే న్యాయం చేస్తున్నారు.

Apr 25 2025 12:55 AM | Updated on Apr 25 2025 12:55 AM

బాధితుల పక్షాన నిలబడాల్సిన కొందరు ఖాకీలు సెటిల్‌మెంట్‌ల

బాధితుల పక్షాన నిలబడాల్సిన కొందరు ఖాకీలు సెటిల్‌మెంట్‌ల

సార్‌ చెప్పండి...

మీరెంత చెప్తే అంత

టీడీపీ నేతల అండతో కొందరు ఖాకీల విచ్చలవిడితనం

ఎమ్మెల్యేలే బాసులుగా విధులు నిర్వర్తిస్తున్న సీఐలు

రాత్రి పదిన్నర తర్వాతే కదిరి అర్బన్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లు

ఇటుకలపల్లి సీఐ దగ్గరికెళితే కేసులతో పాటు బూతులు బోనస్‌

రాయదుర్గం సీఐ జయ.. ఆయనకు లేనిదే దయ అనే విమర్శలు

పుట్టపర్తి ఎస్పీ ఆఫీసులో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ ప్రదీప్‌ హవా

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంతమంది సీఐల వ్యవహార శైలితో ఖాకీ చొక్కాకు అవినీతి మరకలంటుకున్నాయనే విమర్శలున్నాయి. కదిరి అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐగా ఉన్న నారాయణరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గంజాయి కేసులో పట్టుబడిన వారిని ఉదారంగా వదిలేసి కేవలం బైండోవర్‌తో సరిపెట్టారనే విమర్శలున్నాయి. రాత్రి పదిన్నర వరకూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావని, సెటిల్‌మెంట్‌ సక్సెస్‌ అయితే ఎఫ్‌ఐఆర్‌ ఊసే ఉండదని, కుదరకపోతే కేసు నమోదవుతుందని బాధితులు చెబుతున్నారు. సీఐ కార్యాలయం ఎప్పుడూ సివిల్‌ పంచాయితీలతో బిజీగా ఉంటోందని తెలిసింది.

‘జయ’.. కానరాని దయ

రాయదుర్గం అర్బన్‌ సీఐ జయానాయక్‌కు దయ అనేది ఎక్కడా లేదన్న విమర్శలున్నాయి. ఈ స్టేషన్‌లో రోజూ సివిల్‌ పంచాయితీలు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ వివాదంలో బాధితుడి నుంచి భారీగా డబ్బు చేతులు మారినట్టు బాధితుల తరఫు బంధువులు చెప్పారు. స్టేషన్‌కు వచ్చే వారిపట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధికి మాత్రమే సేవకుడిగా ఉంటున్నారనే విమర్శలున్నాయి.

హేమంత్‌ నోట బూతులే..

ఇటుకలపల్లి సీఐగా ఉన్న హేమంత్‌కుమార్‌ నోటికొచ్చినట్టు బూతులు తిడుతున్నట్టు బాధితులు వాపోతున్నారు. పరిటాల శ్రీరామ్‌కు అనుంగు అనుచరుడిగా ఉన్న ఈయన టీడీపీ నేతల అండచూసుకుని రెచ్చిపోతున్నట్టు ఇటీవల ఓ బాధితుడు చెప్పారు. మొన్నటికి మొన్న అక్రమంగా మట్టి తోలుతున్న రెండు టిప్పర్‌లు పట్టుకుని తెల్లారేసరికి వదిలేశారు. వారితో సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్టు తేలింది. టీడీపీ నేతలు చెబితే ప్రత్యర్థులను అకారణంగా స్టేషన్‌కు పిలిపించడం, బెదిరించడం చేస్తున్నట్టు చెబుతున్నారు. స్టేషన్‌కు వెళ్లిన వారికి కనీస మర్యాద ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ కార్యకర్తగా ఎస్‌ఐ సుధాకర్‌

జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఖాకీ డ్రెస్సు వేసుకుని పొలిటికల్‌ పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసుగా రామ గిరి ఎస్‌ఐ సుధాకర్‌ గుర్తింపు పొందారు. పరిటాల కుటుంబానికి పనిమనిషిగా ఉన్నట్టు కూడా ఆరోపణలున్నాయి. ఇటీవల రామగిరి వైస్‌ ఎంపీపీ ఎంపికలో ఎంపీటీసీలను బెదిరించడం, వారిని టీడీపీ వ్యానులో ఎక్కించడం వంటివి బహిరంగంగా చేశారు. బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు. పక్కా టీడీపీ కార్యకర్తలా సామాజిక మాధ్యమాల్లో మాట్లాడినా ఇతనిపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వీసమెత్తు చర్యలు తీసుకోలేదు.

ఎస్‌బీ ఎస్‌ఐ ప్రదీప్‌ కీలకంగా..

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆఫీసులో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న ప్రదీప్‌.. ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. తన పై అధికారులకు పనులు చక్కబెట్టడంలో దిట్ట అని పేరుంది. చాలా మంది సీఐలు, డీఎస్పీలకు జరగని పనులు ప్రదీప్‌కు జరుగుతాయి. సెటిల్‌మెంట్ల ద్వారా పై అధికారులకు ఆర్థిక చేయూతనివ్వడం, ఎప్పటికప్పుడు ఏ పోలీసు అధికారి ఏం చేస్తున్నారో పెద్దబాస్‌కు చెప్పడం ఇతని పని. దీంతో పోలీసు అధికారులు చాలామంది ప్రదీప్‌ అంటే భయపడిపోతున్నారు. జిల్లాలో ప్రదీప్‌ ఏదిచెబితే అది జరుగుతుందని చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement