![నేడు](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/25052024-satya_tab-01_subgroupimage_1330209024_mr.jpg.webp?itok=44aErU-S)
అనంతపురం అగ్రికల్చర్: తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్కు మళ్లిపోవడంతో రాగల ఐదు రోజులు పొడి వాతావరణం ఉంటుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.సహదేవరెడ్డి, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. శనివారం మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చన్నారు. మిగతా నాలుగు రోజులు వర్షసూచన లేదన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.6 నుంచి 38.5 డిగ్రీలు, కనిష్టం 24.8 నుంచి 26.4 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చన్నారు. నైరుతి దిశగా గాలులు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వేసవి దుక్కులు చేసుకోవాలన్నారు. ఖరీఫ్లో వేరుశనగ, ఇతర పంటల సాగుకు వీలుగా నాణ్యమైన అనువైన విత్తనాలు, అలాగే ఎరువులు అందుబాటులో పెట్టుకోవాలని తెలిపారు.
మెరుగైన
వైద్య సేవలందించండి
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
మంజువాణి
అగళి: ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి (డీఎంహెచ్ఓ) మంజువాణి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆమె...అగళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, ఆస్పత్రిలో నిల్వచేసిన మందులను పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య, అందిస్తున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఇంటర్ సప్లిమెంటరీ
పరీక్షలు ప్రారంభం
పుట్టపర్తి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 1,250 మంది హాజరు కావాల్సి ఉండగా 1,177 మంది హాజరయ్యారు, అలాగే ఒకేషనల్కు సంబంధించి 122 మందికి గాను 110 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, పరీక్షల కన్వీనర్ రఘునాథరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 255 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 228 మంది హాజరయ్యారు. అలాగే ఒకేషనల్కు సంబంధించి 61 మందికి గాను 58 మంది హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా మౌలిక వసతులు కల్పించినట్లు పరీక్షల కన్వీనర్ వెల్లడించారు.
పోలీసు సోదాలు ముమ్మరం
పుట్టపర్తి టౌన్: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పాత నేరస్తులు, రౌడీషీటర్ల నివాసాల్లో సోదాలు చేశారు. పలు మండలాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పోలీసులు గ్రామసభలు నిర్వహించారు. కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా నిల్వ ఉంచితే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ వేసినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
![నేడు అక్కడక్కడా వర్షాలు](/sites/default/files/gallery_images/2024/05/25/24mdks202af-110135_mr.jpg)
నేడు అక్కడక్కడా వర్షాలు
![నేడు అక్కడక్కడా వర్షాలు](/sites/default/files/gallery_images/2024/05/25/rainumbrilla_mr.jpg)
నేడు అక్కడక్కడా వర్షాలు