అమరాపురం: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. ముఖ్యంగా సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. సీఎం సహకారంతో డిసెంబర్ నెలాఖరులోగా అమరాపురం చెరువును కృష్ణాజలాలతో నింపుతామన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని హలుకూరు రైతు భరోసా కేంద్రంలో రాగి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ.... రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన దిగుబడులు దళారుల పాలు కాకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ముఖ్యంగా రవాణా, గోనె సంచి, కమీషన్ తదితర ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఊరికో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసిన సీఎం జగన్ రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచారన్నారు. దీంతో రైతులకు వ్యయప్రయాసలు తగ్గాయన్నారు. భవిష్యత్లో ప్రతి రైతుభరోసా కేంద్రం కొనుగోలు కేంద్రంగా మారి రైతులకు మేలు చేస్తుందన్నారు. రైతులకోసం ఇంతలా ఆలోచిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి అందరం మద్దతుగా నిలిచి మరోసారి సీఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీఎం అశ్వర్థనారాయణ నాయక్, ఏఓ మంజునాథ, సర్పంచ్ హనుమక్క, ఎంపీపీ ఈరన్న, జెడ్పీటీసీ సభ్యురాలు స్వారక్క, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ త్రిలోక్నాథ్, జేసీఎస్ ఇన్చార్జ్ శ్రీనివాసరెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు చిక్కన్న, వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి, ఎంపీటీసీలు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
డిసెంబర్ నెలాఖరులోగా నింపుతాం
రాగి కొనుగోలు కేంద్రం
ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి