
బత్తాయి కాయలు, ఆకులపై వచ్చిన తెల్ల మచ్చలు
యాజమాన్య పద్ధతులతో..
పుట్టపర్తి అర్బన్: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలో మామిడి, చీనీ సాగు చేస్తున్న రైతులు యాజమాన్య పద్ధతులు చేపట్టాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. తేనె మంచు పురుగు సోకిన తోటల్లో తేనె వంటి పదార్థం ఆకులపై ఏర్పడి చిగుర్లు ముడుచుకుపోయి పంటపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. తేనెమంచు నివారణకు మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటరు మందును సల్ఫర్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. నవంబర్ నెల మొత్తం నీటి తడులు ఆపేసి చెట్లను వాడుకు గురి చేయాలన్నారు. ఎక్కడైనా బూడిద తెగులు ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే హెక్సాకొనజోల్ 2 మిల్లీ లీటరు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. నవంబర్ రెండో వారంలో ఒకసారి 13:0:45ను 10 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత ఆరోగ్యంగా వచ్చే అవకాశం ఉందన్నారు.
బత్తాయి తోటలో ..
బత్తాయి తోటల్లో ఉన్న నల్లి పురుగు పండ్లపై అధిక ప్రభావం చూపుతాయన్నారు. నల్లి మొదటి దశలో పాత ఆకులపై తర్వాత పండ్లపై ప్రభావం చూపుతాయని చెప్పారు. నల్లి ఆశించిన ఆకులపై తెల్ల గోలీ ఆకారంలో గుడ్లను పైభాగంలో పెడతాయని పేర్కొన్నారు. నల్లి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఒక తరం 6 రోజుల్లో ముగియనుండగా ఆడ నల్లి 4–6 వారాల దాకా జీవించి 30 గుడ్లును పెడుతుందని తెలిపారు. ఇవి వసంత కాలం నుంచి వేసవి చివరి వరకూ వీటిని గమనిస్తూ ఉండాలని సూచించారు. ఇవి చాలా వరకూ తేమ ప్రాంతాల్లో ఉంటాయన్నారు. ఇవి గాలి వీచినప్పుడు చెట్టు నుంచి మరో చెట్టుకు వ్యాపిస్తాయని పేర్కొన్నారు. ఆకుల నుంచి పండ్లకు వ్యాపించి రంగుమారి రాలి పోవడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. వీటి నివారణకు ఒక లీటరు నీటికి 2 ఎంఎల్ ప్రోపర్గైట్ కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. లేదా ఫెస్ ఫెంజాక్విస్/ ఇథియాస్/ డైకోఫోల్ 2 ఎంఎల్ను లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేయాలన్నారు. లేకపోతే ఫెస్ఫైరోక్సిమేట్ / హెక్సిథియోజాక్స్, స్పైరోమెసిఫెస్ మందు 1 ఎంఎల్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. లభించే మందుల ఆధారంగా దేన్నైనా వినియోగించవచ్చన్నారు. ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ఈ మందులతో పాటు వేపనూనె, సబ్బు లేదా కానుగ నూనె సబ్బు 3 గ్రాములు ఉపయోగించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ సూచించారు.
జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్

మామిడి ఆకులపై వచ్చిన తేనె మంచు పురుగు