నెల్లూరు (పొగతోట): ఇంధన డిమాండ్ నేపథ్యంలో కేంద్రం పెంచిన పెట్రో మంట ప్రభావంతో జిల్లాలో నెలకు రూ.100 కోట్ల జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉండే ధరల కంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం అత్యధిక ట్యాక్స్ విధించింది. దీంతో జిల్లాలో మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు రూ.10 అదనంగా ఉంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈ నెపం నెట్టి చంద్రబాబు, లోకేశ్లు దుష్ప్రచారం చేశారు. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ ఆర్భాటంగా హామీలు గుప్పించారు. అధికారం దక్కాక ఆ ఊసే మరిచిపోయారు. తాజాగా కేంద్రం పెట్రోల్ ధరలు పెంచిన నేపథ్యంలోనూ రాష్ట్రంలో ధరలు తగ్గించకపోగా, పెరిగిన ధరలతోనే విక్రయాలు జరుపుతోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.వందకు దిగువన ఉంటే.. జిల్లాలో మాత్రం పెట్రోల్ రూ.113.62, డీజిల్ రూ. 101.24 ధరలు ఉన్నాయి.
కూరగాయలు, నిత్యావసర ధరలు జంప్
పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ కందిపప్పు రూ.130 నుంచి రూ.140, మినపప్పు రూ.120 నుంచి రూ.130లకు, నూనె రూ.160 నుంచి రూ.170 పెరిగాయి. ఇక కూరగాయల ధరలు టమాటా కేజీ రూ.40 నుంచి రూ.50, వంకాయలు రూ.60 నుంచి రూ.70 ధరలు పలుకుతున్నాయి. కూట మి ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరల మోతతో సామాన్య ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ధర లు పెంచమంటూనే ప్రభుత్వం అన్ని ధరలను పెంచుకుంటూ పోతుంది.
జిల్లా ప్రజలపై అదనపు భారం
పెట్రోలు, డీజిల్ ధరల పెరగడంతో జిల్లా ప్రజలపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో 250కి పైగా పెట్రోల్ బంకులు నిత్యం 5 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. వీటిపైనే నెలకు జిల్లా ప్రజలపై ప్రత్యక్షంగా రూ.11.67 కోట్ల పైగా భారం పడుతుండగా, పరోక్షంగా రవాణా రంగంపై పడిన భారంతో పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలతో సుమారు రూ.100 కోట్లపైనే ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నట్లు అంచనా. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరగడంతో దాని ప్రభావంతో హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న చిన్న టిఫిన్ అంగళ్లలో ఆహార పదార్థాల ధరలూ పెరిగాయి.
నేడు వైఎస్సార్సీపీ నిరసనలు : కాకాణి
పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నట్లు మాజీమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి, పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభు త్వం మోసపూరిత వాగ్దానాలను ఎండగట్టాలని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి పోరాటం చేయాలన్నారు.
కూరగాయలు, నిత్యావసర ధరలపై ప్రభావం
రవాణా రంగంపై అదనపు భారం
కూటమి అధికారంలోకి వస్తే
తగ్గిస్తామని.. రెండేళ్లుగా మౌనం
తాజా పెరుగుదలపై కూడా
మారుమాట్లాడని వైనం
రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ
నేడు నియోజకవర్గ కేంద్రాలు, కలెక్టరేట్ వద్ద నిరసనలు : కాకాణి


