ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టినప్పటి నుంచి మత్స్యకారులు ఆయనపై ఉన్న అభిమానంతో ఆ పార్టీకి ఓటు బ్యాంక్గా ఉండేవారు. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా ఆ పార్టీకి అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో దురాయి వేసి.. టీడీపీకి ఓట్లేస్తే ఇంత ద్రోహం తలపెడతారా? అంటూ మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు దశాబ్దాల కాలంలో 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ 2020 విజనరీగా చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు తీసుకోలేదని మత్స్యకారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండు దశాబ్దాలుగా తమిళ జాలర్లు హైస్పీడ్ మెకనైజ్డ్ బోట్లతో ఆంధ్రా ప్రాంత సముద్ర జలాల్లోకి చొచ్చుకువచ్చి మత్స్య సంపదను దోపిడీ చేయడంతోపాటు స్థానిక మత్స్యకారులపై దాడులు చేయడం, బోట్లు, వలలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. అయినా ఏనాడూ మత్స్యకారుల భవిష్యత్ను కాంక్షించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఈ దశలో తమ ప్రాణాలకు తెగించి తమిళ బోట్లను పట్టుకుని నిర్బంధిస్తే.. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా వదిలేయడానికి మంత్రి లోకేశ్ స్కెచ్ వేస్తే.. మరో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కనుసన్నల్లో జరిగిందని మత్స్యకారులు గుర్తించారు.


