చేపలకు మేత వేసేందుకు వెళ్లి..
● చెరువులో పడి వ్యక్తి మృతి
వెంకటాచలం(పొదలకూరు): చెరువులో చేపలకు మేత వేసేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన మండలంలోని కసుమూరు పంచాయతీ శ్రీరామపురంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన శనగల ప్రసాద్(45) తెప్పపై చెరువులోకి వెళ్లి చేపలకు మేత వేస్తుండగా నీటి ప్రవాహం పెరిగింది. తెప్ప అదుపుతప్పడంతో ప్రసాద్ చెరువులో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు శనివారం గజ ఈతగాళ్లను రప్పించి చెరువులో గాలించి ప్రసాద్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించారు. అయితే చెరువుకు పంచాయతీ వేలం పాట నిర్వహించకుండా అనధికారికంగా చేపలను వదిలినట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన వారు చేపలను వదలారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మద్యం దుకాణంలో చోరీ
● రూ.30 వేల అపహరణ
పొదలకూరు: పట్టణంలోని సినీ కాంప్లెక్స్కు సమీపంలో ఉన్న మద్యం దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. షాపు వెనుక వైపు ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన ఆగంతకులు లోనికి ప్రవేశించారు. షాపులో ఉంచిన సుమా రు రూ.30 వేలను అపహరించుకుని వెళ్లారు. శనివారం షాపు తెరిచేందుకు వెళ్లిన నిర్వాహకులు చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరు నుంచి క్లూస్ టీమ్ వచ్చి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. స్థానికులా లేక బయట వ్యక్తులు చోరీకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ రోడ్డుకు సమీపంలోనే రాత్రివేళ కూడా జనసంచారం ఉండే సెంటర్లో దొంగతనం జరగడంపై వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. ఎస్సై హనీఫ్ కేసు నమోదు చేశారు.
చేపలకు మేత వేసేందుకు వెళ్లి..
చేపలకు మేత వేసేందుకు వెళ్లి..


