వచ్చారు.. వెళ్లారు..!
● ఎట్టకేలకు కాలు కదిపిన క్వాలిటీ
కంట్రోల్ ఈఈ
● అర్ధగంటలోనే
ఇరిగేషన్ పనుల పరిశీలన
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కార్యాలయానికి రాకుండా.. పనుల పరిశీలనకూ వెళ్లకుండా కాలం వెళ్లదీస్తున్న క్వాలిటీ కంట్రోల్ ఈఈ ఎట్టకేలకు తన కాలును శుక్రవారం కదిపారు. ఇరిగేషన్ శాఖలో కతే వేరయా.. అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆయనలో కదలికొచ్చింది. సీఎంఓకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడం.. ఇరిగేషన్ శాఖలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని క్వాలిటీ కంట్రోల్ ఈఈ తన తీరును కొంత మేర మార్చుకున్నారు. నీలగిరి సంఘంలోని వెంకన్న కాలువ, రామిరెడ్డి డ్రెయిన్, ముత్తుకూరు వైపు వెళ్లే రేవపల్లి కాలువలో జరుగుతున్న పనులను హడావుడిగా అర్ధగంటలో పరిశీలించి.. ప్రక్రియను ముగించారు. నిర్మాణాల్లో ఉన్న బొంత రాళ్ల విషయమై ఏఈ, డీఈకి సూచనలు చేసి వెళ్లిపోయారు. ఇన్నాళ్లూ స్పందించని ఆయన తీరులో ఇంత మార్పు రావడం ఆ శాఖ అధికారులనే ఆశ్చర్యపర్చింది. పనివేళలు ముగిసే సమయానికి ఇరిగేషన్ సెంట్రల్ ఆఫీస్కు శుక్రవారం సాయంత్రం ఆయన వచ్చారు. గురువారం జరిగిన విచారణకే మళ్లీ వచ్చారని భావించిన ఆ శాఖ అధికారులు తమ సీట్లనొదిలి పరుగులు తీశారు. ఆ శాఖలో ఏమి జరుగుతుందో దీని ద్వారానే అర్థమవుతోంది.


