పర్యాటక శాఖ శకటంలో ‘ఉదయగిరి కోట’కు చోటు
ఉదయగిరి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో సోమవారం నిర్వహించనున్న శకటాల ప్రదర్శనలో ఉదయగిరి కోటకు చోటు దక్కనుంది. వివిధ శాఖల శకటాలతో పాటు పర్యాటక శాఖకు చెందిన శకటాన్ని ప్రదర్శనలో ఉంచాలని అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ఈ క్రమంలో దీన్ని సిద్ధం చేసేలా పర్యాటక శాఖ జిల్లా అధికారి ఉషశ్రీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మైపాడు బీచ్, ఉదయగిరి కోటకు అత్యంత ప్రాధాన్యమివ్వనున్నారు. ఉదయగిరి పట్టణంలోని ప్రాచీన కట్టడాలైన రంగనాథ, కృష్ణాలయాలు, దుర్గంపై గల పెద్ద మసీదు, కోటబురుజులు తదితరాలను కనిపించేలా శకటాన్ని తీర్చిదిద్దనున్నారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ డిజైనర్ సూర్యప్రకాష్, ఉదయగిరికి చెందిన చరిత్ర పరిశోధకుడు మహమ్మద్ ఖాజా సహకారంతో దీన్ని సిద్ధం చేస్తున్నారు.
పోస్టుల్లో నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (లీగల్): జిల్లా న్యాయసేవాధికార సంస్థలో పలు పోస్టుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
● డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంటాఫీస్ కో ఆర్డినేటర్ ఒక పోస్ట్కు గానూ నెలకు రూ.28,280 నుంచి రూ.89,720 వరకు వేతనం లభించనుందని, గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఎమ్మెస్ ఆఫీస్, వెబ్ బ్రౌజింగ్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలని చెప్పారు.
● రికార్డు అసిస్టెంట్ నాలుగు పోస్టులకు గానూ సెకండరీ స్టేట్ బోర్డు లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. ఈ పోస్టులన్నింటికీ 18 నుంచి 42 ఏళ్లలోపు వయస్సు ఉండాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ల సడలింపు ఉంటుందని చెప్పారు. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్, పరీక్ష ఫీజుగా రూ.వెయ్యి.. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కు చెందిన వారు రూ.500కు సంబంధించిన డీ డీని ఏదైనా జాతీయ బ్యాంక్లో సెక్రటరీ, డిస్ట్రి క్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, నెల్లూరు – 524003 పేరిట తీసుకోవాలని తెలిపారు. ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, డిస్ట్రిక్ట్ కోర్టు కాంపౌండ్, నెల్లూరుకు ఈ నెల 27లోపు పంపాలని కోరారు. వివరాలకు కార్యాలయాన్ని పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.
ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి
ఉదయగిరి: స్థానిక అటవీ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచారంపై మిస్టరీ వీడింది. దుర్గం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో పెద్దపులి కదలికలు నిక్షిప్తమయ్యాయనే అంశాన్ని అటవీ అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కొర్సుకొండ, అన్నంపల్లి, కొత్తపల్లి, దుర్గంపల్లి, ఘాట్ రోడ్డులోని కనుమ బావి ప్రాంతాల్లో దీని సంచారం ఉందని గుర్తించారు.
ఓటరు ప్రతిజ్ఞ రేపు
నెల్లూరు(పొగతోట): ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జెడ్పీ కార్యాలయంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఓటరు దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించాల్సి ఉందని, అయితే ఆ రోజు సెలవు కావడంతో ఈ మేరకు జరపనున్నామని చెప్పారు. జెడ్పీ అధికారులు, ఉద్యోగులు హాజరుకావాలని కోరారు.


