
కర్షకుడి కంట కన్నీరు
ఉదయగిరి: జలదంకి మండలం లింగరాజుఅగ్రహారంలో ముగ్గురు టీడీపీ నేతల స్వార్థానికి కోత దశలో ఉన్న 120 ఎకరాల వరి పంట నీట మునిగింది. చేతికందే పంట మొత్తం నీటి పాలై దెబ్బతినడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికే వేలకు వేలు అప్పులు తెచ్చి బ్లాక్మార్కెట్లో ఎరువులు కొని పంట సాగు చేయడానికి అష్టకష్టాలు పడ్డారు. ప్రస్తుతం ధాన్యం ధరలు సైతం పతనమైన నేపథ్యంలో కనీసం పెట్టుబడి అయినా దక్కితే మేలనుకుంటూ ఎదురుచూస్తున్న తరుణంలో టీడీపీ నేతల దుశ్చర్యతో రైతులకు పిడుగుపాటుగా మారింది.
ఆయకట్టను నమ్ముకుని వరి సాగు
లింగరాజుఅగ్రహారం చెరువు ఆయకట్టు కింద ఖరీఫ్లో సుమారు 270 ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో వారం.. పది రోజుల్లో కోత కోసే పరిస్థితికి పంట వచ్చింది. ఈ తరుణంలో చేపలు పట్టుకునేందుకు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గుర్రం ప్రవీణ్, గొట్టిపాటి శ్రీధర్, రాయపాటి మోహన్ రావు చెరువులో చేపలు పట్టుకునేందుకు వేలం ద్వారా అనుమతులు దక్కించుకున్నారు. అయితే నిండుకుండగా ఉన్న చెరువులో చేపలు పట్టడం సాధ్యం కాని పరిస్థితి. దీంతో టీడీపీ నేతలు రైతులను దృష్టిలో పెట్టుకోకుండా చెరువు తూము లు ఎత్తి నీటిని పొలాలకు మళ్లించారు. దీంతో గ్రామానికి చెందిన చెరువు ప్రెసిడెంట్ గుర్రం సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ గాలి మాల్యాద్రి రైతులతో కలిసి చెరువు తూము ద్వారా పొలాలకు నీరు వెళ్లకుండా నిలుపుదల చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు తిరిగి తూమును ఎత్తేశారు. ఫలితంగా సుమారు 120 ఎకరాల్లోని వరి పంటపొలాల్లో మోకాలి లోతు నీళ్లు నిలబడిపోయాయి.
ఏఈ ఆదేశాలు పట్టించుకోకుండా..
ఈ విషయాన్ని ఇరిగేషన్ ఏఈ మాల్యాద్రికి రైతులు వివరించడంతో ఆయన వచ్చి చెరువు తూము నుంచి నీరు పారకుండా చేయాలని చెప్పారు. ఆయన్ను సైతం ధిక్కరించి దిక్కున్నచోట చెప్పుకోండని అనడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారం రోజుల పాటు నీరు విడుదల చేయకుంటే తాము చేతి కొచ్చిన పంటను కోసుకుంటామని చెబుతున్నా వినకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడంపై గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు పొలాలకు ప్రవహించడంతో నీరు ఎక్కువై పంట మొత్తం నీటితో నాని నేతలకు పడిపోయింది. దీంతో రైతులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు.. జలదంకి సొసైటీ చైర్మన్ అప్పలనాయుడు నీట మునిగిన పొలాలను పరిశీలించారు. పంట నష్టం జరిగిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అయితే మూడు రోజులు గడుస్తున్నా చెరువు తూము నీటిని నిలుపుదల చేయలేదని, తమ పంట మొత్తం నీటిలో నానుతూ మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువు చైర్మన్ గుర్రం సుబ్బారావు, వైస్ చైర్మన్ గాలి మాల్యాద్రి, గ్రామ రైతు నాయకుడు గాలి సురేష్ మాట్లాడుతూ చెరువులో చేపలు పట్టుకుని జేబులు నింపుకొనేందుకే తాము ఆరుగాలం పండించిన పంటను ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నీరు నిలిచి పంట నేలబడి మొలకలు వచ్చాయని చూపుతున్న రైతులు
నీట మునిగిన కొతకొచ్చిన పంట
టీడీపీ నేతల స్వార్థం.. రైతులకు కష్టం
చెరువులో చేపలు పట్టుకునేందుకు
నీటి విడుదల
కోత దశలో ఉన్న 120 ఎకరాల వరి పంట నీట మునిగిన వైనం
రైతులు, అధికారుల చెప్పినా వినకుండా చెరువు తూము నుంచి నీటి విడుదల
టీడీపీ నేతలు తమ స్వార్థం కోసం ఏకంగా నిండు చెరువు నీటిని దిగువకు వృథాగా వదిలేయడం చూస్తే అధికార అహంకారానికి నిదర్శనంగా నిలుస్తోంది. చెరువు నీటిని ఆధారంగా చేసుకుని ఆయకట్టు కింద వందల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ప్రస్తుతం వరి కోతల దశలో ఉండగా, చెరువు నీటిని దిగువకు వదలకుండా తూములు బిగించేశారు. అయితే చెరువులో చేపల పట్టుకునే హక్కులను వేలంలో దక్కించుకున్న టీడీపీ నేతలు రైతుల ప్రయోజనాలను తుంగలోతొక్కి చెరువులో నీటిని దిగువకు వదిలేశారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నీట మునిగిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

కర్షకుడి కంట కన్నీరు