
రొట్టెల పండగకు ఏర్పాట్లు
● ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు..
● రూ.3.5 కోట్లతో వసతులు
● మూడు షిఫ్ట్ల్లో 5 వేల మంది
పారిశుధ్య కార్మికులు
● 14 పార్కింగ్ స్థలాల గుర్తింపు
నెల్లూరు(బారకాసు): నెల్లూరులో ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు రొట్టెల పండగను నిర్వహించనున్నారు. రూ.3.5 కోట్లతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పండగకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో 12 తాగునీటి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు పెట్టారు. వర్షం వచ్చినప్పుడు తడవకుండా ఉండేందుకు షెడ్లపైన వాటర్ ప్రూఫ్ జింక్షీట్లు ఏర్పాటు చేశారు.
పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేసేందుకు దాదాపు 14 పార్కింగ్ స్థలాలను గుర్తించారు. నగరంలోని పాత టీబీ హాస్పిటల్, సైన్స్ పార్కు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణం (బాలుర వసతి గృహం వెనుక), వైఎంసీఏ క్రీడా మైదానం, ఎన్టీఆర్ నగర్ సమీపంలోని వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణం, పాత సీవీ రామన్ స్కూల్ ప్రాంగణం, జొన్నవాడకు వెళ్లే దారిలోని డీఎస్ఎన్ మినీ ఫంక్షన్ హాల్ ముందు వైపు, డీఎస్ఎన్ మినీ ఫంక్షన్ హాల్ వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రాంగణం, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెనుక వైపు (కస్తూరిదేవి స్కూల్ ఎదురుగా) ఉన్న ఎగ్జిబిషన్ స్థలం, పొదలకూరురోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం, వీఆర్సీ క్రీడా మైదానం, డీకేడబ్ల్యూ కళాశాల ప్రాంగణం, కస్తూర్బా గార్డెన్ వెనుకవైపు ఉన్న ప్రాంగణం, ప్రసార భారతి (ఆకాశవాణి) రేడియో కేంద్ర సమీపంలోని ప్రాంగణంతోపాటు అవసరం మేరకు పోలీసు అధికారులు సూచించే మరికొన్నిచోట్ల పార్కింగ్ స్థలాలు కేటాయించడం జరుగుతుంది. వాటి వద్ద కార్పొరేషన్ అధికారులు మొబైల్ టాయిలెట్స్, స్నానపు గదులు, తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా విద్యుత్ దీపాలు పెడుతున్నారు. సీసీ కెమెరాలు అమర్చనున్నారు. దర్గా ప్రాంగణంలో 40 సీసీ కెమెరాలతోపాటు మరో 5 పీటీజెడ్ కెమెరాలు, 2 డ్రోన్ల నిత్యం పరిశీలించనున్నారు. వాటిని పోలీస్ కంట్రోల్రూంకు అనుసంధానం చేయడం జరుగుతుంది.
ఏర్పాట్లు ఇలా..
బారాషహీద్ దర్గా ప్రాంగణంతోపాటు సమీప ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నారు. మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు 5 వేల మంది కార్మికులను నియమించడం జరుగుతుంది. స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద మోటార్లతో వాటర్ ప్యూరిఫై చేసే పనులు చేపట్టనున్నారు. దర్గా ప్రాంగణంతోపాటు కేవీఆర్ పెట్రోల్ బంక్, బట్వాడిపాళెం సెంటర్, పొదలకూరోడ్డు కూడలి వరకు రోడ్డుకిరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా వీఐపీ రిసెప్షన్ కోసం ప్రత్యేకంగా టెంట్ వేస్తున్నారు. అన్నదానం చేసేందుకు మరో రెండు టెంట్లు వేయనున్నారు. ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది.
నిత్యం సమీక్షిస్తున్నాం
రొట్టెల పండగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాం. దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశాం. నిత్యం అధికారులతో ఏర్పాట్లను సమీక్షిస్తున్నాం.
– వైఓ నందన్, కమిషనర్,
నెల్లూరు నగరపాలక సంస్థ

రొట్టెల పండగకు ఏర్పాట్లు

రొట్టెల పండగకు ఏర్పాట్లు