
ఇంటర్ ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు
నెల్లూరు (టౌన్): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు ఈ నెల 5వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆర్ఐఓ వరప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో ఫీజు చెల్లించవచ్చన్నారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి అపరుధ రుసుం, తత్కాల్ పద్ధతిన ఫీజు చెల్లించే అవకాశం లేదన్నారు.
వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ
నెల్లూరు(టౌన్):వెంకటేశ్వరపురంలోని ప్రభు త్వ బాలుర ఐటీఐలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువతి, యువకులకు అసెంబ్లీ ఆపరేటర్, రెఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషనర్, సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ కోర్సుల్లో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీధర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్న వారు ఐటీఐకు వచ్చి వారి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9494456326 నంబరులో సంప్రదించాలన్నారు.
తూ.కొ. వెరిఫికేషన్కు
ఆన్లైన్లో దరఖాస్తులు
నెల్లూరు (అర్బన్): జిల్లాలోని తూనికలు, కొలతల పరికరాల వెరిఫికేషన్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ ఐజాక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ పారిశ్రామిక శాఖ వెబ్సైట్లోని సింగిల్ డెస్క్ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి వినియోగదారులు పాన్కార్డు, ఆధార్కార్డు వంటి అవసరమైన వివరాలు అందించాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులపై లీగల్ మెట్రాలజీ అధికారి తూకం, కొలత పరికరాలను భౌతికంగా ధ్రువీకరించి ఆమోదిస్తారన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ధ్రువీకరణ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
అమాయకులపై
అక్రమ కేసు నమోదు
సాక్షి, టాస్క్ఫోర్స్: అక్రమ మైనింగ్ను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారనే అనుమానంతో కొందరు రౌడీమూకల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు అమాయకులపై కేసును నమో దు చేశారు. అయితే సాయంత్రం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఈ ఘటన సైదాపురంలో శుక్రవారం జరిగింది. ముగ్గురు యువకులు చాగణం సమీపంలోని ఓ మైన్ సమీపంలో ఓ వాహనంలో ఉన్నారు. కొందరు రౌడీమూకలు వచ్చి ఈ ప్రాంతంలో ఏమి పని ఉందంటూ దబాయించడంతోపాటు మీరు ఇక్కడ ఏమైనా డ్రోన్లను పంపుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఆ ముగ్గురిపై 20 మంది రౌడీమూకలు దాడి చేసి పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రౌడీ మూకల మాటలకే విలువ ఇచ్చి ఆ ముగ్గురుపై కేసులను నమోదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో సాయంత్రం కల్లా స్టేషన్ బెయిల్ కూడా ఇచి పంపినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహరంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
నిర్లక్ష్యానికి పరాకాష్ట
● మరుగుదొడ్లలో వైద్యశాల మందులు
● రోగులకు అందక కాలం చెల్లాయి
ఉదయగిరి: మండలంలోని గండిపాళెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందించాల్సిన వివిధ రకాల మందులు మరుగుదొడ్డిలో ప్రత్యక్షమయ్యాయి. అక్కడి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వైద్యశాలలకు మందులు పంపిస్తున్నా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో అవి రోగులకు అందడం లేదు. దీంతో కాలం చెల్లడంతో వైద్యశాలలో ఉన్న నాలుగు మరుగుదొడ్డిలో ఈ మందులు నింపి డోర్లు మూసేశారు. ముఖ్యంగా టాబ్లెట్లు, సిరప్లు, పలు రకాల కాలం చెల్లిన ఇంజక్షన్లు మరుగుదొడ్లలో పడేశారు. గండిపాళెం పీహెచ్సీకి నిత్యం ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లోని పలు గ్రామాల రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారికి అవసరం మేరకు మందులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అలా జరగడం లేదు. ఫార్మాసిస్టు సక్రమంగా విధులకు హాజరుకాక పోవడం, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ శనివారం ఉదయగిరి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి సారించి ఇందుకు కారకులైన వైద్య ఆరోగ్య సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.