నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఈ నెల 4వ తేదీన ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ స్టేడియంలోని క్రికెట్ ప్రాంగణంలో నెల్లూరు జిల్లా సీనియర్ టీ –20 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కేఎస్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు సొంత క్రీడా కిట్లతో ఆధార్కార్డుతో ఉదయం 8 గంటలకు హాజరు కావాలని సూచించారు.
ఎల్టీ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల
నెల్లూరు (అర్బన్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 7 ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులకు ఇటీవల దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని డీఎంహెచ్ఓ వి.సుజాత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. spsnellore.ap. gov.in/ notice/ recruitment వెబ్సైట్లో ఉంచామన్నారు. అభ్యర్థులు పరిశీలించుకుని ప్రొవిజనల్ మెరిట్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలున్నాయని భావిస్తే తగిన ఆధారాలతో ఈ నెల 8వ తేదీలోపు జిల్లా వైద్యశాఖా కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమన్నారు.
రేపు మంత్రి సత్యకుమార్ పర్యటన
నెల్లూరు(అర్బన్): రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్యాదవ్ శుక్రవారం రాత్రి 11 గంటలకు కావలికి చేరుకుని రాత్రికి బస చేస్తారు. శనివారం ఉదయం 9 గంటలకు వింజమూరులో ఏర్పాటు చేసిన కిడ్నీ రోగుల కోసం డయాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 11.45 గంటలకు నెల్లూరులోని జయభారత్ ఆస్పత్రి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు అల్లీపురం కార్యక్రమాల్లో పాల్గొని, అక్కడి నుంచి 3 గంటలకు పొదలకూరుకు వెళ్లి కిడ్నీ రోగుల కోసం డయాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.
93.26 శాతం పింఛన్ల పంపిణీ
నెల్లూరు (పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా మొదటి రోజు గురువారం 93.26 శాతం మంది లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. 3,03,602 మంది లబ్ధిదారులకు పింఛను నగదు పంపిణీ చేయాల్సి ఉండగా, 2,83,149 మందికి నగదు అందజేశారు.
పిడుగుతో చెలరేగిన మంటలు
ఉదయగిరి: ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు మండలాలల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఉదయగిరి మండలం జి.అయ్యవారిపల్లి సమీపంలో పిడుగు పడడంతో విద్యుత్ పరికాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆ ప్రాంతం అంతా మంటలు వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై తమ పశువులను వేరే ప్రాంతానికి తరలించారు. ప్రాణ నష్టం జరగలేదు. వింజమూరులో కూడా రాత్రి ఉరుములు, మెరుపుల వాతావరణం ఏర్పడింది.
సీఎం సభకు వస్తూ వృద్ధుడి మృతి
ఆత్మకూరు: ఆత్మకూరులో జరిగిన చంద్రబాబు సభకు వస్తూ ఓ వృద్ధుడు కుప్పకూలి మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. వెంకట్రావుపల్లికి చెందిన పెంచలయ్య అలియాస్ వెంకటేశ్వర్లు (65) హెలిప్యాడ్ వద్దకు వెళ్తూ ఎండవేడిమికి తట్టుకోలేక రోడ్డుపై కుప్పకూలాడు. దీంతో సమీపంలోని వారు పరిశీలించి ఓ యువకుడు సీపీఆర్ చేశారు. వెంటనే ఆ వృద్ధుడు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. పట్టణంలోని ఓ హోటల్లో ఇతను పని చేస్తుంటాడు. మృతుడికి భార్య, వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.