
త్రుటిలో తప్పిన ప్రమాదం
నేలకూలిన ప్రజావేదిక స్వాగత ఆర్చీ ఇనుప స్తంభం
ఆత్మకూరు: సీఎం చంద్రబాబునాయుడు గురువారం ఆత్మకూరు పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సభాస్థలి ప్రజావేదిక వద్ద స్వాగత ఆర్చీకి ఓ వైపు ఏర్పాటు చేసిన ఇనుప స్తంభం నేలకూలింది. అయితే సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు అయింది. నెల్లూరు–ముంబై రహదారి పక్కనే ప్రజావేదిక ఏర్పాటు చేయడంతో మిట్ట మధ్యాహ్నం వేళ ఆ మార్గంలోని వాహనాలను నిలిపివేయడంతో ప్రయాణికులు ఓ వైపు ఎండ, చెమట్లు కక్కుతూ దాహంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సీఎం మాట్లాడుతుండగా..
మిట్టమధ్యాహ్నం ప్రజావేదికలో సీఎం దాదాపు 1.20 గంటల సేపు మాట్లాడారు. అయితే ఆయన ఉపన్యాసం ప్రారంభించిన అరగంట అనంతరం వెనకాల ఉన్న పలువురు సభ నుంచి వెళ్లిపోయారు. మహిళలు సైతం ఎండకు తట్టుకోలేక వెళ్లిపోయారు. దీంతో సగానికిపైగా కుర్చీలు ఖాళీ అయ్యాయి.
దివ్యాంగుడిని అనుమతించని అధికారులు
పింఛన్ పునరుద్ధరించాలని ఓ దివ్యాంగుడు సీఎం సభావేదిక సభకు వెళ్తుండగా సెక్యూరిటీ అధికారులు నిలిపివేయడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన సుధాకర్ దివ్యాంగుడు. గతంలో ఇతనికి పింఛన్ వస్తుండేది. అయితే వారి కుటుంబంలోని అందరికి కలిపి 10 ఎకరాలకు పైగా భూమి ఉందని పింఛన్ను నిలిపివేశాడు. దీంతో సుధాకర్ తన సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు వ్యయ ప్రయాసలకోర్చి మండుటెండలో ప్రజావేదిక సభకు చేరుకున్నాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ, పోలీసులు అతనిని లోపలికి పంపలేదు. అర్జీలు ఇచ్చేందుకు సమీపంలోని మరో కౌంటర్ వద్ద ఉన్న అధికారికి ఇవ్వాలని చెప్పగా తాను ముఖ్యమంత్రికే ఇవ్వాలని సుధాకర్ పట్టుబట్టారు. అయితే పోలీసులు, సెక్యూరిటీ విభాగం అధికారులు అతనిని అక్కడ నుంచి రోడ్డు మీదకు తరలించారు. ఆ దృశ్యాలు చూసిన పలువురు అయ్యో అంటూ విచారం వ్యక్తం చేశారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

త్రుటిలో తప్పిన ప్రమాదం