
మూగజీవాలకు అండగా..
ఆత్మకూరు: ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వేసవి తాపానికి మనుషులే అల్లాడిపోతున్నారు. ఇక మూగజీవాలైతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దాహార్తిని తీర్చుకునేందుకు ఊర్లలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతుంటాయి. ఈ నేపథ్యంలో జీవాలకు నీరందించేందుకు ఓ మహిళా ఉద్యోగిని సొంత నిధులు ఖర్చు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడులో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న డి.శ్రీలత అడవి జంతువుల దాహం తీర్చేందుకు ముంబై రహదారి పక్కన అటవీ ప్రాంతంలో నీటితొట్లు కట్టించారు. సొంత నిధులతో 2019 నుంచి మండలంలోని అనేకచోట్ల తొట్లను కట్టించి నీటి సౌకర్యం కల్పించారు. ఇటీవల మరో ఐదు నీటితొట్టెల్ని రూ.30 వేలతో కట్టించారు. ఒక్కో దాని నిర్మాణం కోసం సుమారు రూ.6 వేలు ఖర్చు చేశారు. తొట్టెల్లో ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీరు నింపడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వారానికోమారు అన్ని తొట్టెల్లో నీరు నింపేలా అద్దెకు ట్రాక్టర్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం నెలకు రూ.5 వేలు నుంచి రూ.6 వేలు ఖర్చు చేస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన పలువురు అభినందిస్తున్నారు.
ట్యాంకర్ ద్వారా నీరు నింపుతూ..
వేసవి నేపథ్యంలో తాగునీటికి ఏర్పాట్లు
వేల రూపాయలతో నీటితొట్టెల నిర్మాణం
మానవత్వం చాటుకుంటున్న
పంచాయతీ కార్యదర్శి
అందరి బాధ్యత
తాగునీటి కోసం మూగజీవాలు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురై చనిపోతుంటాయి. జీవాలను మనం కాకపోతే మరెవరు రక్షిస్తారు. జంతువుల రక్షణ మనందరి బాధ్యత. ప్రతిఒక్కరూ చేతనైనంత సేవ చేయాలి.
– శ్రీలత, పంచాయతీ కార్యదర్శి

మూగజీవాలకు అండగా..