
టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ తండ్రి భూపేంద్ర జైస్వాల్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. కుమారుడు సాధిస్తున్న విజయాలను చూసి మురిసిపోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యశస్వి జైస్వాల్ గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
జైస్వాల్ ఆడే షాట్లలో తనకు స్వీప్ షాట్ అన్నింటికంటే ఎక్కువ ఇష్టమని తెలిపారు భూపేంద్ర జైస్వాల్. అదే విధంగా కుమారుడికి ఇష్టమైన వంటకాల పేర్లు కూడా వెల్లడించారు.
ఈ మేరకు.. ‘‘తనకు మటన్ అంటే చాలా ఇష్టం. అలాగే పప్పన్నం, బ్రెడ్, అన్ని రకాల కూరలు ఇష్టంగా తింటాడు’’ అని భూపేంద్ర జైస్వాల్ ఇండియా టుడేతో పేర్కొన్నారు. తన కుమారుడు ఇప్పటికే టెస్టు క్రికెట్లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడన్న భూపేంద్ర జైస్వాల్.. భవిష్యత్తులో తన పేరిట అరుదైన ఘనతలు లిఖించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 8 టెస్టులాడిన 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ 934 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు, 3 అర్థ శతకాలు ఉన్నాయి.
ఇందులో ఆ రెండు ద్విశతకాలను ఇంగ్లండ్తో తాజా సిరీస్ సందర్భంగానే బాదాడు ఈ లెఫ్టాండర్ . ఇక ఇప్పటి వరకు 17 అంతర్జాతీయ టీ20లలో 502 పరుగులు సాధించాడు. ఇక ఇటీవలే.. యశస్వి జైస్వాల్ ముంబైలోని బాంద్రాలో రూ. 5 కోట్లకు పైగా వెచ్చించి ఫ్లాట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: Yashasvi Jaiswal: టెంట్లలో నివాసం నుంచి.. బాంద్రా ఫ్లాట్ దాకా! కోట్లు పెట్టి కొన్నాడు