ఉప్పల్ వేదికగా కోల్కతానైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు నిరాశపరిచారు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు ఎప్పటిలాగే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 45 పరుగుల వద్ద అభిషేక్ రూపంలో సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది.
అయినప్పటికి మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై మాత్రం విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కిషన్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ హెడ్గా తోడుగా నిలిచాడు.
వీరిద్దరి ధాటికి 9 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ దాటింది. అయితే 9వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆఖరి బంతికి హెడ్(61) ఔటయ్యాడు. హెడ్ ఔటైప్పటికి ఎస్ఆర్హెచ్ స్కోర్ 9 ఓవర్లకు 105 పరుగులగా ఉంది. ఆ తర్వాత సన్రైజర్స్ వికెట్ల పతనం మొదలైంది.
ప్రతీ మ్యాచ్లో మిడిలార్డర్లో వెన్నుమకగా నిలిచిన క్లాసెన్ సైతం నిరాశపరిచాడు. 11 పరుగులు చేసి గ్రీన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత డెబ్యూ ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్ కూడా వెంటనే ఔటయ్యాడు. యువ ఆటగాళ్లు అనికేత్ వర్మ, ఆరోరా కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి కిషన్ క్రీజులో ఉండడంతో సన్రైజర్స్ భారీ స్కోర్ సాధిస్తుందని భావించారు.
కానీ 42 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ కూడా సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అనంతరం లోయార్డర్ బ్యాటర్లు కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. దీంతో ఆరెంజ్ ఆర్మీ కేవలం 60 పరుగుల వ్యవధిలో మొత్తం 8 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా సన్రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఈ ఏడాది సీజన్లో సన్రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్ తలా రెండు వికెట్లు సాధంచారు.


