శ్రీలంక పేసర్ నువాన్ తుషార సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తీరుపై అసంతృప్తితో అతడు కోర్టుకెక్కినట్లు సమాచారం. రైటార్మ్ పేసర్ అయిన 31 ఏళ్ల తుషార.. శ్రీలంక తరఫున ఇప్పటికి 30 టీ20 మ్యాచ్లు ఆడి 36 వికెట్లు కూల్చాడు.
తొలి టైటిల్
ఇంతవరకు అతడు టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేయనేలేదు. అయితే, టీ20లో మంచి గుర్తింపు పొందిన తుషారను ఐపీఎల్-2025 మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు ఒక్క మ్యాచే ఆడినప్పటికీ జట్టు టైటిల్ గెలవడంతో సంతోషంలో మునిగిపోయాడు.
NOC ఇవ్వలేదని..
ఈ క్రమంలో ఐపీఎల్-2026 సీజన్కు గానూ ఆర్సీబీ నువాన్ తుషారను అట్టిపెట్టుకుంది. అయితే, ఆర్సీబీతో చేరేందుకు శ్రీలంక బోర్డు అతడికి ఇంత వరకు నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వలేదు. ఫిట్నెస్ పరీక్షలో ప్రమాణాలకు తగినవిధంగా లేడనే కారణంగా అతడికి NOC ఇవ్వలేదని సమాచారం.
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై?
అయితే, స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని తుషార బోర్డుకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మార్చి 31తో తన సెంట్రల్ కాంట్రాక్టు ముగిసిపోయినందున.. కాంట్రాక్టును పునరుద్ధరించాల్సిన అవసరం లేదని లేఖ రాసినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో తాను జట్టు మారే యోచనలో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.
కోర్టుకెక్కిన తుషార
కానీ బోర్డు తన అభ్యర్థనను పట్టించుకోకపోవడం, ఐపీఎల్లో ఆడేందుకు NOC ఇవ్వకపోవడంతో తుషార న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ, కార్యదర్శి బందులా దిస్సానాయకే, కోశాధికారి సుజీవ గొడలియాడ, సీఈఓ ఆష్లే డి సిల్వలను ప్రతివాదులుగా చేరుస్తూ కొలంబో జిల్లా కోర్టులో తుషార పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 9న విచారణ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఐపీఎల్-2026ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి జయకేతనం ఎగురవేసింది.
చదవండి: అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే.. అందుకే తప్పుకొన్నా: ఇంగ్లండ్ దిగ్గజ పేసర్


