ఈశాన్యంలో ఆరు క్రికెట్‌ అకాడమీలు | PM Modi inaugurates 6 modern indoor cricket academies developed by BCCI in Northeast | Sakshi
Sakshi News home page

ఈశాన్యంలో ఆరు క్రికెట్‌ అకాడమీలు

Apr 29 2026 12:21 PM | Updated on Apr 29 2026 12:28 PM

PM Modi inaugurates 6 modern indoor cricket academies developed by BCCI in Northeast

ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్‌ శిక్షణ, అభివృద్ధిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో అత్యుత్తమ స్థాయి సౌకర్యాలు ఉన్న ఆరు ఇండోర్‌ క్రికెట్‌ అకాడమీలను ఏర్పాటు చేసింది. వీటిని మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకేసారి వర్చువల్‌గా ప్రారంభించారు. 

ఐసీసీ చైర్మన్‌ జైషా, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఇతర బోర్డు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇందులో పాల్గొన్నారు. రాంగ్పో (సిక్కిం), డోయిముఖ్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌), ఇంఫాల్‌ (మణిపూర్‌), మదన్‌కుర్క్‌లంగ్‌ (మేఘాలయ), ఐజ్వాల్‌ (మిజోరం), దీమాపూర్‌ (నాగాలాండ్‌)లలో ఈ అకాడమీలో ఏర్పాటయ్యాయి. 

జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడే ఈశాన్య రాష్ట్రాల్లో అకాడమీల ఏర్పాటు గురించి ప్రతిపాదన జరిగిందని, ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చిందని బీసీసీఐ ప్రకటించింది. హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్లుగా గుర్తింపునిచ్చిన ఈ ఆరు అకాడమీల్లో ఇండోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌లు, హైటెక్‌ జిమ్‌లు, ఉష్ణోగ్రత నియంత్రిత స్విమ్మింగ్‌ పూల్‌లు, నిర్వహణ కోసం ఇతర ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. 

‘దేశంలో అన్ని ప్రముఖ క్రికెట్‌ కేంద్రాల్లో లభించే సౌకర్యాలన్నీ ఇప్పుడు ఈశాన్య రాష్ట్ర వర్ధమాన క్రీడాకారులకు అందుబాటులో వచ్చాయి. భవిష్యత్తులో ఇక్కడినుంచి ఎంతో మంది ఉత్తమ ఆటగాళ్లు వెలుగులోకి వస్తారని ఆశిస్తున్నా’ అని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement