ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కరికి దక్కిన అరుదైన ఘనతను, తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, సుయాశ్ శర్మ సాధించారు. ఆర్సీబీతో ఐపీఎల్ 2026 ఛాంపియన్గా నిలవడంతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిళ్ల (సీజన్లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడిన ఆటగాళ్లలో) అరుదైన ఫీట్ను నమోదు చేశారు. గతంలో కర్ణ్ శర్మ ఒక్కడే ఈ ఫీట్ను సాధించగా.. తాజాగా సాల్ట్, సుయాశ్ అతని సరసన చేరారు.
కర్ణ్ శర్మ 2016లో ఎస్ఆర్హెచ్తో, 2017లో ముంబై ఇండియన్స్తో, 2018లో సీఎస్కేతో ఐపీఎల్ టైటిళ్లు సాధించగా.. సాల్ట్, సుయాశ్ 2024లో కేకేఆర్తో, 2025, 2026లో ఆర్సీబీతో ఐపీఎల్ టైటిళ్లు సాధించి, చారిత్రక రికార్డును సొంతం చేసుకున్నారు.
మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది వరుసగా రెండో ఎడిషన్లో టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలి 17 ఎడిషన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని ఆర్సీబీ వరుసగా రెండు ఎడిషన్లు టైటిల్ సాధించి, టైటిళ్ల కరువును తీర్చుకుంది.
ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన ఆ జట్టు టాపార్డర్, బౌలింగ్ విభాగాలు తుది సమరంలో చేతులెత్తేశాయి. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన గుజరాత్.. ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.


