పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు ఆ దేశ క్రికెట్ బోర్డు రూ.67 లక్షల భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కారణంగా పీసీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఈ చర్యపై పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఇటువంటి చర్యలు ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీస్తాయని యూనిస్ మండిపడ్డాడు.
అసలు ఏం జరిగిందంటే?
మార్చి 27న లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభ మ్యాచ్కు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ హాజరయ్యారు. దీన్ని నసీమ్ తప్పుపడుతూ.. ‘‘ఆమెను లార్డ్స్లో రాణిలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు?’’ అని మరియంను ఉద్దేశించి వ్యంగ్యంగా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశాడు.
వెంటనే అతడు ఆ పోస్టను తొలిగించినప్పటికి, పీసీబీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. పీసీబీ క్రమశిక్షణ కమిటీ కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నసీమ్ షాకు 20 మిలియన్ల పాక్ రూపాయల జరిమానా విధించింది. ఈ క్రమంలోనే పీసీబీ నిర్ణయాన్ని యూనిస్ తప్పుబట్టాడు.
నసీమ్ షా ఆ ట్వీట్కు క్షమాపణ కూడా చెప్పాడు. తన సోషల్ మీడియా మేనేజర్ పొరపాటున చేశాడని నసీమ్ ఇప్పటికే వివరణ ఇచ్చాడు. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి కూడా తప్పించాడు. అలాంటప్పుడు హెచ్చరికతో వదిలేయాల్సింది. లేదంటే తక్కువ మొత్తంలో జరిమానా విధించాల్సింది. ఇటువంటి చర్యలు ఆటగాళ్లను నిరుత్సాహపరుస్తాయి అని యూనిస్ పేర్కొన్నాడు.
చదవండి: KKR vs SRH: సన్రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?


