చరిత్ర సృష్టించిన ఐపీఎల్‌ 2023.. ఇంకా 22 మ్యాచ్‌లు ఉండగానే..!

IPL 2023 Witnessed Six 200 Plus Run Chases In Just 52 Matches, Most In Any Season - Sakshi

అత్యధిక 200 ప్లస్‌ లక్ష్య ఛేదనలు జరిగిన సీజన్‌గా ఐపీఎల్‌-2023 చరిత్ర సృష్టించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే (52 మ్యాచ్‌లు) 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లు విజయవంతంగా ఛేదించబడ్డాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఏ సీజన్‌లోనూ ఈ స్థాయిలో 200 ప్లస్‌ స్కోర్ల ఛేదన జరగలేదు. ఈ సీజన్‌లో ఇంకా 22 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మరిన్ని విజయవంతమైన 200 ప్లస్‌ స్కోర్ల లక్ష్య ఛేదనలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్‌లో బ్యాటర్ల విధ్వంసం ఓ రేంజ్‌లో సాగుతుండటంతో ఇకపై ప్రతి మ్యాచ్‌లో భారీ లక్ష్యాలు ఛేదించబడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దాదాపు అన్ని జట్ల బ్యాటింగ్‌ లైనప్‌లు పటిష్టంగా ఉండటంతో భారీ లక్ష్యాలను తృణప్రాయంగా ఊదేసే అవకాశం ఉంది. 

ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన 200 ప్లస్‌ లక్ష్య ఛేదనలు జరిగిన మ్యాచ్‌లు ఇవే..

  1. గుజరాత్‌ వర్సెస్‌ కేకేఆర్‌: గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఆఖరి ఓవర్‌లో రింకూ సింగ్‌ విధ్వంసం (ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు) సృష్టించడంతో కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 207/7) చిరస్మరణీయ విజయం సాధించింది. 
  2. ఆర్సీబీ వర్సెస్‌ లక్నో: ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. స్టోయినిస్‌ (65) సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో లక్నో వికెట్‌ తేడాతో (20 ఓవర్లలో 213/9) గెలుపొందింది. 
  3. సీఎస్‌కే వర్సెస్‌ పంజాబ్‌: సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ప్రభసిమ్రన్‌సింగ్‌ (42) చెలరేగడంతో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 201/6) విజయం సాధించింది. 
  4. రాజస్థాన్‌ వర్సెస్‌ ముంబై: రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగలు చేయగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (55) మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో (19.3 ఓవర్లలో 214/4) ఘన విజయం సాధించింది. 
  5. పంజాబ్‌ వర్సెస్‌ ముంబై: పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. ఇషాన్‌ కిషన్‌ (75) సత్తా చాటడంతో ముంబై 6 వికట్లె తేడాతో (18.5 ఓవర్లలో 216/4) గెలుపొందింది. 
  6. రాజస్థాన్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌: రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ సహకారంతో సన్‌రైజర్స్‌ 4 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 217/6) గెలుపొందింది. 
  • పై 6 మ్యాచ్‌ల్లో నాలుగు చివరి బంతి వరకు సాగగా.. రెండు ఒకటి, అర ఓవర్ల ముందుగానే ముగిసాయి. 
  • ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ రెండు సార్లు 200 ప్లస్‌ లక్ష్యాలను ఛేదించగా.. రాజస్థాన్‌ రెండు సార్లు 200 ప్లస్‌ స్కోర్లను డిఫెండ్‌ చేసుకోలేకపోయింది. 
  • ఈ సీజన్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు (215) ముంబై, సన్‌రైజర్స్‌ పేరిట ఉంది.  
  • ఐపీఎల్‌లో అత్యధిక లక్ష్యాన్నిఛేదించిన రికార్డు (224) రాజస్థాన్‌ పేరిట ఉంది. 2020 సీజన్‌లో ఆ జట్టు పంజాబ్‌పై ఈ ఫీట్‌ను సాధించింది. 

చదవండి: తొక్క తీస్తా.. RRR మాస్‌ వార్నింగ్‌, వెనక్కు తగ్గిన రాజస్థాన్‌ రాయల్స్‌
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top